Burgundy Private Hurun India 500: విలువలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నంబర్‌ 1

2 Dec, 2022 05:00 IST|Sakshi

తర్వాతి స్థానాల్లో టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌

హరూన్‌ ఇండియా 500 కంపెనీల జాబితా

ముంబై: దేశంలో అత్యంత విలువైన (మార్కెట్‌ విలువ ఆధారితంగా) లిస్టెడ్‌ కంపెనీగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మొదటి స్థానంలో నిలిచింది. టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ రెండు, మూడో స్థానాల్లో ఉన్నాయి. ‘2022 బర్గండి ప్రైవేట్‌ హరూన్‌ ఇండియా 500’ కంపెనీల జాబితా గురువారం విడుదలైంది. 500 కంపెనీల ఉమ్మడి విలువ రూ.226 లక్షల కోట్లుగా ఉంది. రిలయన్స్‌  మార్కెట్‌ విలువ రూ.17.25 లక్షల కోట్లు. రెండో స్థానంలో ఉన్న టీసీఎస్‌ మార్కెట్‌ క్యాప్‌ రూ.11.68 లక్షల కోట్లుగా ఉంది. రూ.8.33 లక్షల కోట్ల మార్కెట్‌ క్యాప్‌తో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ మూడో స్థానంలో నిలిచింది. ఇన్ఫోసిస్‌ (రూ.6.46 లక్షల కోట్లు), ఐసీఐసీఐ బ్యాంక్‌ (రూ.6.33 లక్షల కోట్లు), ఎయిర్‌టెల్‌ (రూ.4.89 లక్షల కోట్లు), హెచ్‌డీఎఫ్‌సీ (రూ.4.48 లక్షల కోట్లు), ఐటీసీ (రూ.4.32 లక్షల కోట్లు), అదానీ టోటల్‌ గ్యాస్‌ (రూ.3.96 లక్షల కోట్లు), అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ రూ.3.81 లక్షల కోట్ల విలువతో టాప్‌–10లో ఉన్నాయి.

అదానీ కంపెనీలు ఎనిమిది..
‘‘గౌతమ్‌ అదానీకి సంబంధించి ఏడు కంపెనీలు ఇందులో ఉన్నాయి. అంబుజా సిమెంట్స్‌ కొనుగోలుతో ఎనిమిదో కంపెనీ వచ్చి చేరింది. ఉపఖండంలో అత్యంత సంపన్నుడు కావడందో ఇదేమీ ఆశ్చర్యాన్నివ్వలేదు. టాటా సన్స్‌ నుంచి ఆరు కంపెనీలు, సంజీవ్‌ గోయెంకా నుంచి మూడు, కుమార మంగళం బిర్లా నుంచి మూడు చొప్పున కంపెనీలు జాబితాలో ఉన్నాయి’’అని హరూన్‌ ఇండియా ఎండీ అనాస్‌ రెహమాన్‌ జునైద్‌ తెలిపారు.

లిస్టులో తెలంగాణ సంస్థల సంఖ్య రెండు పెరిగి 31కి చేరింది. టాప్‌ 10 యంగెస్ట్‌ కంపెనీల జాబితాలో సువెన్‌ ఫార్మా, మెన్సా బ్రాండ్స్‌ చోటు దక్కించుకున్నాయి.   

మరిన్ని వార్తలు