అంతర్జాతీయ వేదికపై బైజుస్‌..! ఫస్ట్‌ ఇండియన్‌ కంపెనీగా రికార్డు..!

24 Mar, 2022 16:48 IST|Sakshi

అంతర్జాతీయ వేదికపై  ఎడ్యుకేషన్ టెక్నాలజీ సంస్థ బైజుస్‌ తళుక్కున మెరవనుంది. క్రీడారంగంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే  ఫిఫా వరల్డ్‌ కప్‌కు అధికారిక  స్పాన్సర్‌గా ఎంపికైనట్లు బైజుస్‌ గురువారం ప్రకటించింది. ఫిఫా వరల్డ్‌ కప్‌ 2022 ఖతార్‌లో జరగనుంది. దీంతో ఫిఫా వరల్డ్‌ కప్‌ను స్పాన్సర్‌ చేస్తోన్న మొదటి ఎడ్‌టెక్‌ భారతీయ కంపెనీగా బైజుస్‌ అవతరించింది. ఈ చారిత్రాత్మక ఒప్పందం బైజుస్‌ స్పోర్ట్స్ స్పాన్సర్‌షిప్ వ్యూహంలో ఒక ముఖ్యమైన ముందడుగును సూచిస్తుందని బైజుస్‌ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇదిలా ఉండగా భారత క్రికెట్‌ టీమ్‌కు కూడా అధికారిక స్పాన్సర్స్‌గా బైజుస్‌ వ్యవహరిస్తోన్న విషయం తెలిసిందే.  

‘ప్రపంచంలోనే అతిపెద్ద సింగిల్-స్పోర్ట్ ఈవెంట్ ఫిఫా  వరల్డ్ కప్ -2022కి స్పాన్సర్ చేస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాము.ఇటువంటి ప్రతిష్టాత్మకమైన వేదికపై భారత్‌కు ప్రాతినిధ్యం వహించడం, విద్య , క్రీడల ఏకీకరణలో విజయం సాధించడం మాకు గర్వకారణమ’ని బైజుస్‌ వ్యవస్థాపకుడు అండ్‌ సీఈవో బైజు రవీంద్రన్  అన్నారు. 

బైజుస్‌తో జత కట్టినందుకు ఎంతగానో సంతోషిస్తున్నామని ప్రపంచ సాకర్ గవర్నింగ్ బాడీ ఫిఫా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ కే మదాతి  పేర్కొన్నారు. ఈ భాగస్వామ్యంతో ప్రపంచంలోని యువతకు సాధికారితను కల్పించేందుకు ఎంతగానో ఉపయోగపడుతోందని అభిప్రాయపడ్డారు. నవంబర్ 21 నుంచి డిసెంబర్ 18, 2022 వరకు ఫిఫా వరల్డ్‌ కప్‌ 2022 జరగనుంది. 
 


చదవండి: ఎల్‌ఐసీ పాలసీదారులకు అలర్ట్‌..! ఇదే చివరి అవకాశం..!

మరిన్ని వార్తలు