ప్రభుత్వ, ప్రైవేటు ప్రాజెక్టుగా భారత్ నెట్

30 Jun, 2021 16:45 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలోని 16 రాష్ట్రాల్లోని నివాసిత గ్రామాలకు పీపీపీ(ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం)మోడల్ ద్వారా భారత్ నెట్ అందించడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అంటే బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటీని పెంచడం కోసం, సేవలు అందించడానికి కేంద్రం ప్రైవేట్ రంగానికి అనుమతి ఇచ్చింది. "దేశంలో ఇంటర్నెట్‌ బ్రాడ్‌బాండ్‌ కనెక్టివీటీ పెంచేందుకు ఉద్దేశించిన భారత్‌ నెట్‌ పథకానికి అదనంగా రూ.19,041 కోట్లు కేటాయిస్తున్నట్టు" కొద్ది రోజుల క్రితమే ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ ప్రకటించారు. 

అలా ప్రకటించిన రెండు రోజులకే "16 రాష్ట్రంలోని 3,61,000 గ్రామాల్లో ఇంటర్నెట్‌ బ్రాడ్‌బాండ్‌ కనెక్టివీటీ అందించేందుకు పీపీపీ పద్దతిలో ప్రపంచ స్థాయిలో బిడ్డింగ్ నమూనాను అమలు చేయాలి" అని కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. రెండు రోజుల క్రితం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన నిర్ణయాలకు మంత్రివర్గం ఈ రోజు ఆమోదం తెలిపింది అని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు. భారతదేశంలోని అన్ని గ్రామాల్లో సమాచార విప్లవం కోసం చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నట్లు ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. 

2020 ఆగస్టు 15న ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంలో అన్ని గ్రామాలు 1,000 రోజుల్లో బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్‌ తో అనుసంధానించబడతాయని అన్నారు.భారత్‌ నెట్‌ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో ప్రాజెక్టుగా ప్రారంభించారు. 2021, మే 31 నాటికి 1,56,223 గ్రామ పంచాయతీలలో బ్రాడ్ బ్యాండ్ సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నాయి. దీని కోసం ఇప్పటికే రూ.42,068 కోట్ల రూపాయలు కేటాయించినట్లు నిర్మల సీతారామన్‌ తెలిపారు. ఈ పథకానికి తాజాగా రూ.19,041 కోట్లు కేటాయించడంతో దీంతో ఈ పథకం మొత్తం విలువ రూ. 61,109 కోట్లకు చేరుకుంది.

మరిన్ని వార్తలు