ఎన్‌ఏఆర్‌సీఎల్‌ జారీ చేసే సెక్యూరిటీ రిసిప్ట్స్‌కు కేంద్రం గ్యారంటీ

16 Sep, 2021 18:41 IST|Sakshi

ఎన్‌ఏఆర్‌సీఎల్‌ రూ.30,600 కోట్ల వరకు జారీ చేసే సెక్యూరిటీ రిసిప్ట్స్‌కు ప్రభుత్వం గ్యారంటీగా ఉండే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం సెప్టెంబర్ 16న ఆమోదం తెలిపింది. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో ఎన్‌ఏఆర్‌సీఎల్‌(‎నేషనల్ అసెట్ రీకన్ స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్‎) జారీ చేసే సెక్యూరిటీ రిసిట్స్‌కు సావరిన్‌(ప్రభుత్వ) గ్యారంటీ లభించనుంది. మొండిబకాయిలకి సంబంధించి ఆమోదిత విలువలో 15 శాతం ఎన్‌ఏఆర్‌సీఎల్‌ నగదు రూపంలో చెల్లిస్తుంది. మిగిలిన 85 శాతం ప్రభుత్వ హామీతో కూడిన సెక్యూరిటీ రిసిప్ట్స్‌ ఉంటాయని కేంద్రం పేర్కొంది. 

గత ఆరు ఆర్థిక సంవత్సరాల్లో బ్యాంకులు రూ.5,01,479 కోట్లు రికవరీ చేసినట్లు ఆర్ధిక మంత్రి తెలిపారు. ఇందులో రూ.3.1 లక్షల కోట్లు 2018 మార్చి నుంచి రికవరీ చేయబడ్డాయి. ఏదైనా ఎన్‌పీఏ కొనుగోలుకు సంబంధించి ప్రవేశ విలువలో నష్టం జరిగితే ప్రభుత్వ హామీ భరోసాగా ఉంటుంది అని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. కేంద్ర ఆర్ధిక మంత్రి మీడియాతో మాట్లాడుతూ.."ఎన్‌పీఏలను నిర్వహించడం కోసం మేము ఇండియా డెట్ రిజల్యూషన్ కంపెనీ లిమిటెడ్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఈ కంపెనీలో పీఎస్‌బిలు, ప్రభుత్వ యాజమాన్యంలోని ఆర్థిక సంస్థలు 49% వాటాను కలిగి ఉంటాయి. అలాగే, ప్రైవేటు రంగ బ్యాంకులు కూడా వాటాను కలిగి ఉంటాయని" ఆమె తెలిపారు.

(చదవండి: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఫెస్టివల్‌ బొనాంజా ఆఫర్లు..!)

"మొండిబకాయిలకి సంబంధించి బ్యాంకులకు 15 శాతం నగదు చెల్లింపు చేయనున్నాము. 85 శాతం ప్రభుత్వ హామీతో కూడిన సెక్యూరిటీ రిసిప్ట్స్‌ జారీ చేస్తాము. ఆ బ్యాంకులకు బ్యాక్ స్టాప్ గ్యారెంటీ ఉంటుంది" అని ఆమె తెలిపింది. భద్రతా రసీదులు బ్యాక్ స్టాప్ నిధులను అందిస్తాయని, ఐదేళ్లపాటు మాత్రమే బాగుంటుందని సీతారామన్ తెలిపారు. ఆర్థిక సేవల కార్యదర్శి దేబాషిష్ పాండా మాట్లాడుతూ.. ఎన్‌ఏఆర్‌సీఎల్‌ ను ఇప్పటికే ఒక సంస్థగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తొలి దశలో రూ.90,000 కోట్ల విలువైన ఎన్‌పీఏలను ఎన్‌ఏఆర్‌సీఎల్‌ కు బదిలీ చేస్తామని ఆయన చెప్పారు.

మరిన్ని వార్తలు