బ్యాడ్‌ బ్యాంక్‌కు రంగం సిద్ధం! 

30 Jun, 2021 03:29 IST|Sakshi

ప్రభుత్వ గ్యారెంటీ ప్రతిపాదనకు త్వరలో క్యాబినెట్‌ ఆమోదముద్ర

న్యూఢిల్లీ: మొండి బకాయిల పరిష్కారంలో భాగంగా  ప్రతిపాదిత బ్యాడ్‌ బ్యాంక్‌ లేదా నేషనల్‌ అసెట్‌ రికన్‌స్ట్రక్షన్‌ కంపెనీ (ఎన్‌ఏఆర్‌సీఎల్‌) ఏర్పాటుకు రంగం సిద్ధం అవుతోంది. ఇందుకు తొలి అడుగుగా ఎన్‌ఏఆర్‌సీఎల్‌ జారీ చేసే సెక్యూరిటీ రిసిప్‌్ట్సకు  ప్రభుత్వం గ్యారెంటీగా ఉండే ప్రతిపాదనకు త్వరలో కేంద్ర క్యాబినెట్‌ ఆమోదముద్ర పడే అవకాశం ఉందని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ గ్యారెంటీ తక్షణం దాదాపు రూ.31,000కోట్లు ఉంటుందని బ్యాడ్‌ బ్యాంక్‌ ఏర్పాటు బాధ్యతలను పర్యవేక్షిస్తున్న ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ (ఐబీఏ) అంచనావేసింది. మొండిబకాయికి సంబంధించి ఆమోదిత విలువలో 15 శాతం ఎన్‌ఏఆర్‌సీఎల్‌ నగదులో చెల్లిస్తుంది. మిగిలిన 85 శాతం ప్రభుత్వ హామీతో కూడిన సెక్యూరిటీ రిసిప్‌్ట్సగా ఉంటాయని ఉన్నత స్థాయి వర్గాలు పేర్కొంటున్నాయి. ఎన్‌ఏఆర్‌సీఎల్‌ జారీ చేసే సెక్యూరిటీ రిసిట్స్‌కు సావరిన్‌ (ప్రభుత్వ) గ్యారెంటీ లభించేందుకు  క్యాబినెట్‌ ఆమోదం తప్పనిసరని సంబంధిత వర్గాలు తెలిపాయి.  

అమల్లో కీలక అడుగు! : 2021–22 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ బ్యాడ్‌ బ్యాంక్‌ ప్రతిపాదన చేశారు. ఈ ప్రతిపాదన అమలుకు తొలుత సెక్యూరిటీ రిసిప్‌్ట్సకు  ప్రభుత్వం గ్యారెంటీకి సంబంధించి క్యాబినెట్‌ ఆమోదం కీలకం. ‘‘ప్రస్తుత మొండిబకాయిల నిర్వహణకు అసెట్‌ రికన్‌స్ట్రక్షన్‌ కంపెనీ ఏర్పాటు  జరుగుతుంది. ఒత్తిడిలో ఉన్న రుణ బకాయిని ఈ కంపెనీ తన ఆ«దీనంలోనికి తీసుకుని నిర్వహిస్తుంది లేదా ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్స్‌ లేదా ఇతర అర్హత కలిగిన ఇన్వెస్టర్లకు బిడ్డింగ్‌ ప్రాతిపదికన విక్రయిస్తుంది. తద్వారా రుణ బకాయికి తగిన విలువను పొందుతుంది’’ అని ఆర్థిక మంత్రి బడ్జెట్‌ ప్రసంగం పేర్కొంది. ఎన్‌ఏఆర్‌సీఎల్‌లో ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటా 51 శాతంగా ఉండనుంది. మిగిలిన వాటాను ప్రైవేటు రంగ బ్యాంకులు కలిగిఉంటాయి. ఎన్‌ఏఆర్‌సీల్‌లో 12 శాతం వాటాతో లీడ్‌ స్పాన్‌సర్‌గా ఉండామన్న ఆకాంక్షను ప్రభుత్వ రంగ కెనరాబ్యాంక్‌ వ్యక్తం చేసింది. తొలి దశలో బ్యాడ్‌ బ్యాంక్‌కు బదలాయించడానికి 22 మొండి బకాయిలను గుర్తించినట్లు సమాచారం. వీటి విలువ దాదాపు రూ.89,000 కోట్లు. రానున్న కొద్ది కాలంలో దాదాపు రూ.2 లక్షల కోట్ల మొండిబకాయిలను  నేషనల్‌ అసెట్‌ రికన్‌స్ట్రక్షన్‌ కంపెనీ నిర్వహిస్తుందని అంచనా. ఎన్‌పీఏల పరిష్కారంలో ఇది మంచి పురోగతి అవుతుందని అంచనా.  

మరిన్ని వార్తలు