మొబైల్‌ డేటా చీప్‌గా దొరికే దేశాల జాబితా విడుదల,భారత్‌కు ఎన్నో స్థానమంటే?

27 Jul, 2022 19:08 IST|Sakshi

అతి తక్కువ ధరకే మొబైల్‌ డేటా లభ్యమయ్యే దేశాల జాబితాలో భారత్‌ నిలిచింది. 233 దేశాల‍్లో సేకరించిన డేటా ఆధారంగా భారత్‌తో పాటు మరో నాలుగు దేశాల్లో వినియోగదారులకు మొబైల్‌ డేటాగా చీప్‌గా దొరుకుతున్నట్ల తాజాగా విడుదలైన ఓ నివేదిక తెలిపింది. 

యూకేకి చెందిన 'కేబుల్‌.కో.యూకే' అనే టెలికాం సంస్థ 233 దేశాల్లో 1జీబీ డేటా ధర ఎంత ఉందనే అంశంపై ఓ డేటాను విడుదల చేసింది. అందులో మొబైల్‌ డేటా తక్కువ ధరకే లభ్యమయ్యే 5 దేశాల్లో భారత్‌కు 5వ స్థానం దక్కింది. 

ఇక ఆ 5దేశాల్లో ఇజ్రాయిల్‌ దేశం 1జీబీ డేటాను 0.04 డాలర్లు (భారత్‌ కరెన్సీలో రూ.3.20), ఇటలీ 0.12 డాలర్లు(రూ.9.59), శాన్ మారినో 0.14 డాలర్లు (రూ.11.19), ఫిజి దేశంలో 1జీ డేటా 0.15 డాలర్ల (రూ.11.99),  భారత్‌ 0.17 డాలర్ల (రూ.13.59)తో వరుస స్థానాల్లో నిలిచాయి. 

1జీబీ మొబైల్‌ డేటా రూ.3,323
కేబుల్‌.కో.యూకే నివేదిక మొబైల్‌ డేటా ధర ఎక్కువగా ఉన్న 5 దేశాల జాబితాను విడుదల చేసింది. అందులో 1జీబీ డేటాను 41.06 డాలర్ల(రూ.3,323.92)కు అత్యధికంగా అమ్ముడవుతున్న దేశాల జాబితాలో  సెయింట్ హెలెనా ప్రథమ స్థానలో నిలిచింది. 

ఈ జాబితాలో తర్వాతి స్థానాల్లో ఫల్క్‌ ల్యాండ్‌ దీవుల్లో 38.45 డాలర్లు (రూ.3,072.11) , సెంట్రల్‌ ఆఫ్రికా దేశమైన సెయింట్ థామస్ (São Tomé) ప్రిన్సిపి (principe)లో 29.49 డాలర్లు ( రూ.2,356) , టోకెలావ్ (Tokelau )లో 17.88 (రూ.1428) , యెమన్ దేశంలో 16.58 డాలర్ల (1324.72) ధరతో వరుస స్థానాల్లో నిలిచాయి. 

మరిన్ని వార్తలు