ఇండియా వర్సెస్‌ కెయిర్న్‌,.. కుదిరిన డీల్‌ ?

8 Sep, 2021 08:03 IST|Sakshi

భారత్‌ ఆఫర్‌కు ఓకే అంటోన్న కెయిర్న్‌ ఎనర్జీ

బిలియన్‌ డాలర్లు తిరిగి చెల్లింపు సమ్మతమే

కేసులను వెంటనే వెనక్కి తీసుకుంటాం

కెయిర్న్‌ ఎనర్జీ సీఈవో ప్రకటన 

న్యూఢిల్లీ: రెట్రోస్పెక్టివ్‌ పన్ను తిరిగి చెల్లించే విషయమై భారత ప్రభుత్వం ఇచ్చిన ఆఫర్‌ పట్ల బ్రిటన్‌కు చెందిన కెయిర్న్‌ ఎనర్జీ పీఎల్‌సీ సానుకూలంగా స్పందించింది. రెట్రోస్పెక్టివ్‌ చట్టాన్ని రద్దు చేసే బిల్లుకు గత నెలలో పార్లమెంట్‌ ఆమోదం తెలుపడం తెలిసిందే. దీంతో గతంలో ముక్కు పిండి వసూలు చేసిన బిలియన్‌ డాలర్లకు పైన (రూ.7,900 కోట్లు సుమారు) కెయిర్న్‌ ఎనర్జీకి భారత ప్రభుత్వం తిరిగి చెల్లించనుంది. దీనికంటే ముందు కెయిర్న్‌ ఎనర్జీ భారత సర్కారు ఆస్తుల స్వాధీనానికి పలు దేశాల్లో వేసిన కేసులను ఉపసంహరించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

సమ్మతమే
భారత్ ఇచ్చిన ఆఫర్‌ తమకు ఆమోదనీయమేనని కెయిర్న్‌ ఎనర్జీ సీఈవో సైమన్‌ థామ్సన్‌ లండన్‌లో ప్రకటించారు. తమకు భారత సర్కారు నుంచి చెల్లింపులు అందిన రోజుల వ్యవధిలోనే.. ప్యారిస్‌లోని భారత రాయబార కార్యాలయ అపార్ట్‌మెంట్లు, అమెరికాలో ఎయిర్‌ ఇండియా విమానం జప్తునకు సంబంధించి దావాలను వెనక్కి తీసుకుంటామని చెప్పారు. ‘‘మా వాటాదారులైన బ్లాక్‌రాక్, ఫ్రాంక్లిన్‌ టెంపుల్‌టన్‌ ఇందుకు అంగీకరించాయి. మా కీలకమైన వాటాదారుల మద్దతు ఆధారంగానే మా అభిప్రాయం ఉంటుంది. ఎన్నో ఏళ్లుగా ప్రతికూలంగా నడుస్తున్న దాన్ని ముగించి, ఇచ్చిన ఆఫర్‌ను ఆమోదించడం మంచిది, ఆచరణాత్మకం అన్నది అభిప్రాయం’’ అని థామ్సన్‌ పేర్కొన్నారు.  సరైన అవకాశం ఉంటే..: భారత్‌కు కెయిర్న్‌ ఎనర్జీ  తిరిగొస్తుందా? అన్న ప్రశ్నకు.. సమస్య తొలగిపోతే సరైన పెట్టుబడి వేదిక కాగలదని సైమన్‌ థామ్సన్‌ చెప్పారు. సరైన అవకాశం ఉంటే ఎందుకు రాబోమని అన్నారు. 2012 నాటి రెట్రోస్పెక్టివ్‌ పన్ను చట్టం కింద 50 ఏళ్ల క్రితం నమోదైన లావాదేవీలపైనా ప్రభుత్వం పన్ను వేయగలదు. భారత్‌లోని ఆస్తుల యాజమాన్యాలు విదేశీ ఇన్వెస్టర్ల మధ్య చేతులు మారితే లాభాలపై పన్నును ఈ చట్టం కింద రాబట్టుకోవచ్చు. 

చదవండి: వోస్తోక్‌ ప్రాజెక్ట్‌పై ఓవీఎల్‌ దృష్టి


 

మరిన్ని వార్తలు