భారత్, కెనడా దేశాల మధ్య కీలకమైన వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఈ మేరకు భారత్ నుంచి అరటి, బేబీ కార్న్లను దిగుమతి చేసుకునేందుకు కెనడా అంగీకరించింది. కేంద్ర వ్యవసాయ కార్యదర్శి మనోజ్ అహూజా, కెనడా హైకమిషనర్ కెమరాన్ మెక్కేల మధ్య జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
భారత్, కెనడాల మధ్య తాజాగా కుదిరిన ఒప్పందంతో తాజా అరటి పళ్లను తక్షణమే దిగుమతి చేసుకునేందుకు కెనడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా సాంకేతిక అంశాల కారణంగా బేబీకార్న్ దిగుమతికి కొంత సమయం కావాలని కెనడా కోరింది. దాదాపు 2022 ఏప్రిల్ చివరి నాటికి భారత్ నుంచి కెనడాకి బేబీకార్న్ ఎగుమతులు ప్రారంభం కావొచ్చు.
మన దేశంలో అరటి పంటను భారీ ఎత్తున సాగు చేస్తున్నారు. ముఖ్యంగా ఏపీ , తెలంగాణలో వేలాది ఎకరాల్లో అరటి సాగవుతోంది. తాజాగా అరటి దిగుమతికి కెనడా అంగీకరించడంతో రైతులకు, వ్యాపారులకు కొత్త మార్కెట్ అందుబాటులోకి వచ్చినట్టయ్యింది.