డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ కుంభకోణం.. రూ.34,615 కోట్ల మోసం.. సీబీఐ కేసు నమోదు

22 Jun, 2022 21:30 IST|Sakshi

యూనియన్‌ బ్యాంక్‌ నేతృత్వంల్యోని 17 బ్యాంకుల కన్సార్టియాన్ని రూ. 34,615 కోట్ల రూపాయలకు మోసం చేశారంటూ దివాస్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కార్పోరేషన్‌ (డీహెచ్‌ఎఫ్‌ఎల్‌) ప్రమోటర్లు కపిల్‌ వాధ్వాన్‌, ధీరజ్‌ వాధ్వాన్‌లపై సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ కేసు నమోదు చేసింది. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ప్రమోటర్లతో పాటు అమరిల్లీస్‌ రియల్టర్స్‌కు చెందిన సుధాకర్‌ శెట్టి, మరో ఆరుగురు బిల్డర్లపై కూడా సీబీఐ కేసు నమోదు చేసింది.

2010 నుంచి 2018 వరకు 17 బ్యాంకులతో కూడిన కన్సార్టియం నుంచి ఏకంగా రూ.42,871 కోట్లు రుణాలు సేకరించింది హెచ్‌డీఎఫ్‌ఐ. అయితే 2019 నుంచి రుణాలకు సంబంధించిన చెల్లింపులు నిలిచిపోయాయి. దీంతో కన్సార్టియంకు నేతృత్వం వహిస్తున్న యూనియన్‌ బ్యాంకు 2021లో సీబీఐకి లేఖ రాసింది. తాము తాజాగా నిర్వహించిన ఆడిట్‌లో ఈ మోసం వెలుగు చూసినట్టు పేర్కొంది. దీనిపై దర్యాప్తు చేయాలని సీబీఐని  ఈ ఏడాది ఫిబ్రవరిలో యూనియన్‌ బ్యాంకు కోరింది. దీనిపై విచారణ చేపట్టిన అనంతరం సీబీఐ కేసులు నమోదు చేసింది.

బ్యాంకుల మోసానికి సంబంధించి డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ అతి పెద్దదిగా నిలిచింది. ఈ కుంభకోణంలో రూ. 34,615 కోట్ల వరకు మోసం జరిగింది. ఇంతకు ముందు ఏజీబీ షిప్‌యార్డ్‌ కంపెనీ బ్యాంకులను రూ.22,842 కోట్ల వరకు ముంచడమే అతి పెద్ద మోసంగా రికార్డయ్యింది. కాగా యెస్‌ బ్యాంకును చీట్‌ చేసిన కేసులో కూడా డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ప్రమోటర్లకు ప్రమేయం ఉంది.
 

చదవండి: దటీజ్‌ టాటా.. ఆ కంపెనీకంటూ కొన్ని విలువలు ఉన్నాయ్‌!

మరిన్ని వార్తలు