సీబీఎస్‌ఈకి ఆదాయ పన్ను మినహాయింపు

12 Apr, 2023 04:52 IST|Sakshi

న్యూఢిల్లీ: పరీక్ష ఫీజులు, పాఠ్యపుస్తకాల విక్రయాలు మొదలైన వాటి ద్వారా వచ్చే ఆదాయంపై పన్ను నుంచి సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ)కి ఆర్థిక శాఖ మినహాయింపునిచ్చింది. 2020–21 ఆర్థిక సంవత్సరం నుంచి 2024–25 ఆర్థిక సంవత్సరం వరకు ఇది వర్తిస్తుందని తెలిపింది. సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ (సీబీడీటీ) ఈ మేరకు ఒక నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

పరీక్ష ఫీజులు, అఫిలియేషన్‌ ఫీజులు, పాఠ్యపుస్తకాలు.. ప్రచురణల విక్రయం, రిజిస్ట్రేషన్‌ ఫీజు, స్పోర్ట్స్‌ ఫీజు, శిక్షణ ఫీజులు మొదలైన ఆదాయాలు ఈ పరిధిలోకి వస్తాయి. ఆయా ఆర్థిక సంవత్సరాల్లో సీబీఎస్‌ఈ ఎలాంటి వ్యాపార కార్యకలాపాల్లో పాలుపంచుకోకుండా ఉంటేనే ఈ పన్ను మినహాయింపులు వర్తిస్తాయి. 2020 జూన్‌ 1 నుంచి పరిమిత కాలం పాటు మాత్రమే ప్రస్తుత నోటిఫికేషన్‌లో ప్రస్తావించినందున అంతక్రితం సంవత్సరాలకు కూడా దీన్ని వర్తింపచేసేలా, అప్పటికే కట్టిన ట్యాక్స్‌ల రీఫండ్‌లను క్లెయిమ్‌ చేసుకునేందుకు ప్రత్యేక అనుమతి కోసం సీబీడీటీకి సీబీఎస్‌ఈ దరఖాస్తు చేసుకోవాల్సి రావచ్చని ఏఎంఆర్‌జీ అండ్‌ అసోసియేట్స్‌ జాయింట్‌ పార్ట్‌నర్‌ ఓమ్‌ రాజ్‌పురోహిత్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు