దొడ్డి దారిన వివో స్మార్ట్‌ఫోన్‌ల రవాణా.. భారీ షాకిచ్చిన భారత్‌!

7 Dec, 2022 14:03 IST|Sakshi

చైనా స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ వివోకు ఎదురు దెబ్బ తగిలింది. దేశీయంగా తయారు చేసిన స్మార్ట్‌ ఫోన్‌లను విదేశాలకు తరలించే ప్రయత‍్నం చేస్తుండగా కేంద్ర అధికారులు వారం రోజుల పాటు శ్రమించి సుమారు 27వేల ఫోన్‌ల రవాణాను అడ్డుకున్నట్లు తెలుస్తోంది. 

వివో కమ్యూనికేషన్స్ టెక్నాలజీ సంస్థ భారత్‌లో స్మార్ట్‌ ఫోన్‌లను తయారు చేసి స్థానికంగా విక్రయిస్తుంది. అయితే తాజాగా వివో తయారు చేసిన ఆ స్మార్ట్‌ఫోన్‌లను, వాటి విలువను తక్కువగా చూపెట్టి దేశ సరిహద్దులు దాటిస్తున్నారంటూ ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన రెవెన్యూ ఇంటెలిజెన్స్ యూనిట్ విభాగానికి సమాచారం అందింది. సమాచారం అందుకు ఇంటెలిజెన్స్‌ పోలీసులు న్యూఢిల్లీ విమానాశ్రయంలో ఫోన్‌లను సరఫరా చేస్తున్న నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఆఫోన్‌ల విలువ దాదాపు  15 మిలియన్‌లని తేలింది.  

ఈ సందర్భంగా వివోపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ చైర్మన్ పంకజ్ మొహింద్రూ డిసెంబర్ 2న ఐటీ శాఖకు చెందిన ఉన్నతాధికారులకు లేఖ రాశారంటూ బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. కేంద్ర సంస్థలు తమ మెరుగైన పనితీరుతో దేశీయంగా ఎలక్ట్రానిక్స్ వస్తువుల తయారీ, ఎగుమతులను ప్రోత్సహించేందుకు దోహదం చేస్తాయని అన్నారు. 

రూ.62,476కోట్లు
చైనా స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థలు మనీ ల్యాండరింగ్‌ యాక్ట్‌ను ఉల్లంఘిస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఈఏడాది జులైలో ఈడీ అధికారులు చైనా సంస్థ వివోతో పాటు ఇతర సంస్థలకు చెందిన కార్యాలయాలకు చెందిన 44 ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. అదే సమయంలో వివో  మోసాలను ఈడీ బయటపెట్టింది. వివో కంపెనీ భారత్‌లో పన్నులు ఎగొట్టి టర్నోవర్‌లో దాదాపు 50శాతం నిధులను చైనాకు తరలించిందని, 2017 నుంచి 2021 మధ్య కాలంలో మొత్తం రూ.62,476కోట్లు ఉందని వెల్లడించింది. పన్నుల ఎగవేతపై కోర్టులో కేసు విచారణ జరుగుతుండగా.. వివో ఫోన్‌లను ఇతర దేశాలకు తరలించడం సంచలనంగా మారింది.

>
మరిన్ని వార్తలు