వెయ్యి టన్నులా, బంగారం కొనుగోళ్లపై సెంట్రల్‌ బ్యాంక్‌ల ఫోకస్‌​

13 Jul, 2021 10:05 IST|Sakshi

2021, 2022లో వెయ్యి టన్నుల కొనుగోళ్ల అవకాశం

ధరల స్థిరత్వానికి దోహదం!  

న్యూఢిల్లీ: వివిధ దేశాల సెంట్రల్‌ బ్యాంకులు పసిడి కొనుగోలు ప్రణాళికల్లో ఉన్నాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ కొనుగోళ్ల వల్ల అంతర్జాతీయంగా పసిడి ధర పటిష్ట స్థాయిలో స్థిరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. గడచిన ఏడాది కాలంలో బంగారం కొనుగోళ్లకు దూరంగా ఉన్న సెంట్రల్‌ బ్యాంకులు తిరిగి యల్లో మెటల్‌పై ఆసక్లి చూపుతున్నట్లు సమాచారం. సెర్బియా నుంచి థాయ్‌లాండ్‌ వరకూ సెంట్రల్‌ బ్యాంకులు తాజాగా తమ విదేశీ మారకపు నిధుల్లో పసిడి వాటా పెంపుపై దృష్టి పెడుతున్నాయి. పసిడికి కొనుగోలు చేయనున్నట్లు ఘనా ఇటీవల ప్రకటించింది.  

దీర్ఘకాలికంగా ప్రయోజనం
ద్రవ్యోల్బణం ఒత్తిడులకు దీర్ఘకాలంలో పసిడి మంచి ప్రయోజనాలను అందిస్తుందని, ఆర్థిక పరమైన గట్టు స్థితి నుంచి గట్టెక్కిస్తుందని నేషనల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ సెర్బియా ఇటీవలే ప్రకటించింది. ప్రస్తుతం తమ సెంట్రల్‌ బ్యాంక్‌ వద్ద ఉన్న 36.3 టన్నుల పసిడిని 50 టన్నులకు పెంచుకోనున్నట్లు కూడా సెర్బియా అధ్యక్షుడు అలెక్సాండర్‌ వూసిక్‌ పేర్కొన్నారు. క్రూడ్‌ ధరల పెరుగుదల వల్ల కజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్‌ వంటి చమురు ఎగుమతిదేశాలు పసిడి కొనుగోళ్లపై దృష్టి సారిస్తున్నట్లు హెచ్‌ఎస్‌బీసీ హోల్డింగ్స్‌ మెటల్స్‌ చీఫ్‌ విశ్లేషకులు జేమ్స్‌ స్టీల్‌ పేర్కొన్నారు. వచ్చే ఏడాది ప్రతి ఐదు సెంట్రల్‌ బ్యాంకుల్లో ఒకటి పసిడి కొనుగోలు చేసే ప్రణాళికలో ఉన్నట్లు వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ ఇటీవలి నివేదిక ఒకటి పెరిగింది.  ప్రపంచ రికవరీ బులిష్‌ పరిస్థితుల్లో సెంట్రల్‌ బ్యాంకులు 2021లో 500 టన్నులు, 2022లో 540 టన్నుల పసిడిని కొనుగోలు చేసే అవకాశం ఉందని ఈ రంగంలో నిపుణులు అంచనావేస్తున్నారు. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు, భౌగోళిక ఉద్రిక్తతల వంటి పరిస్థితుల్లో సెంట్రల్‌ బ్యాంకుల కొనుగోళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని కూడా అంచనా.  

మరిన్ని వార్తలు