'ఫాస్టాగ్‌' కథ కంచికి..ఇక దూరాన్ని బట్టి కొత్త పద్ధతిలో టోల్ వసూళ్లు!

8 Aug, 2022 16:04 IST|Sakshi

వాహనదారులకు ముఖ్య గమనిక. కేంద్రం ఫాస్టాగ్‌ వ్యవస్థకు మంగళం పాడనుంది. అవును.. ఫాస్టాగ్‌ కథ మూణ్ణాళ్ల ముచ్చటగానే ముగియబోతోంది. మరి టోల్ చార్జీల వసూలు ఎలాగంటారా? అందుకోసం కొత్త పద్ధతిని ఆచరించబోతున్నట్లు సూత్రప్రాయంగా తెలియజేసింది. 


ఇప్పుడున్న ఫాస్టాగ్‌ స్థానంలో..  జీపీఎస్‌ శాటిలైట్‌ టెక్నాలజీని ఉపయోగించి టోల్‌ వసూలు చేయాలని సంబంధింత మంత్రిత్వ శాఖ భావిస్తోంది. ఇప్పుటికే ఈ జీపీఎస్‌ టెక్నాలజీ ఆధారిత పైలెట్‌ ప్రాజెక్ట్‌ను ప్రారంభించినట్లు సమాచారం. ప్రస్తుతం, ఒక టోల్ ప్లాజా నుండి మరొక టోల్ ప్లాజాకు మొత్తం దూరానికి టోల్ ఛార్జీలు కట్టాల్సి ఉంటుంది. కానీ ఈ జీపీఎస్‌ టెక్నాలజీతో హైవేపై వెహికల్‌ ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తుందో.. దాని ఆధారంగా టోల్ చెల్లించాల్సి వస్తుంది. 

కేంద్రమంత్రి ప్రకటన 
ఈ ఏడాది మార్చిలో జరిగిన లోక్‌సభ సమావేశాల్లో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రసంగించారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏడాదిలోగా దేశవ్యాప్తంగా టోల్ ప్లాజా బూత్‌లను ప్రభుత్వం తొలగించనున్నట్లు ప్రకటించారు. అంతేకాదు జీపీఎస్ శాటిలైట్ టెక్నాలజీని ఉపయోగించి టోల్ ఛార్జీలను వసూలు చేయనున్నట్లు చెప్పారు. కొత్త పద్దతిలో కదులుతున్న వెహికల్‌ జీపీఎస్‌ ఇమేజెస్‌ సాయంతో టోల్‌ ఛార్జీలను వసూలు చేసే సౌలభ్యం కలుగుతుందన్నారు.

యూరప్‌ దేశాల్లో జీపీఎస్ ఆధారిత విధానం విజయవంతం కావడంతో మనదేశంలో దీనిని అమలు చేసేందుకు కేంద్రం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా కేంద్ర రవాణా శాఖ జీపీఎస్‌ టెక్నాలజీని పరీక్షించేందుకు మనదేశంలో పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించినట్లు నివేదికలు పేర్కొన్నాయి. కాగా, కేంద్రం ఈ కొత్త విధానాన్ని అమలు చేసే ముందు ట్రాన్స్‌పోర్ట్‌ విధానాన్ని మార్చాల్సి ఉండగా.. పైలట్ ప్రాజెక్ట్‌లో  దేశవ్యాప్తంగా 1.37 లక్షల వెహికల్స్‌పై ఈ జీపీఎం వ్యవస్థను ప్రయోగించనున్నారు. 

 ఫాస్ట్‌ట్యాగ్‌లు 
రద్దీ సమాయాల్లో టోల్‌ గేట‍్ల వద్ద వాహనదారులు గంటల తరబడి ఎదురు చూసే అవసరాన్ని తగ్గించేందుకు కేంద్రం 2016లో ఫాస్ట్‌ట్యాగ్‌ వ్యవస్థని అందుబాటులోకి తెచ్చింది. ఎలక్ట్రానిక్ పద్ధతిలో టోల్ బూత్‌లలో రుసుము చెల్లించడాన్ని సులభతరం చేసింది.

చదవండి👉 బుడ్డోడి చేతికి స్మార్ట్‌ వాచ్‌..ఫాస్టాగ్‌తో అకౌంట్‌లలో మనీని దొంగిలించవచ్చా?

మరిన్ని వార్తలు