కాలిపోతున్న ఎలక్ట్రిక్ వెహికల్స్‌..బ్యాటరీలపై కేంద్రం సంచలనం నిర్ణయం!

19 Apr, 2022 16:59 IST|Sakshi

ఇటీవల దేశంలో పలు ప్రాంతాల్లో వరుసగా ఎలక్ట్రిక్‌ వాహనాలు అగ్నికి ఆహుతవుతున్నాయి. దీంతో వాహనదారులు ఎలక్ట్రిక్‌ వెహికల్స్ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్‌ బైక్స్‌లో ఉండే బ్యాటరీల నిబంధనల్ని సవరిస్తూ కేంద్రం సంచలనం నిర్ణయం తీసుకోనుందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.  
 
“మేం సెల్ ప్రమాణాలు, బ్యాటరీల పరీక్షా ప్రమాణాలు, నిర్వహణ పద్దతుల్ని సవరిస్తాం. నిర్దిష్ట టెంపరేచర్‌ దాటిన తర్వాత బ్యాటరీలలోని ద్రావణంలో రాపిడి జరిగి (ఉదాహరణకు లిథియం అయాన్‌ బ్యాటరీలోని ఎలక్ట్రోలేడ్‌ ద్రావణం) ప్రమాదాలు జరుతున్నాయని ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి” అని ఒక సీనియర్ ప్రభుత్వ అధికారి తెలిపారంటూ వెలుగులోకి వచ్చిన ఓ నివేదిక పేర్కొంది. 

మరోవైపు కేంద్రం తీసుకోనున్న ఈ కొత్త నిర్ణయం ఎలక్ట్రిక్‌ వెహికల్‌ తయారీ దారులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే..ప్రస్తుతం ఆయా ఆటోమొబైల్‌ సంస్థలు మార్కెట్‌లో ఈవీ వెహికల్స్‌ ఉన్న డిమాండ్‌ను బట్టి విపరీతంగా తయారీని పెంచుతున్నాయి. ఒకవేళ కేంద్రం బ్యాటరీల నిబంధనల్ని సవరిస‍్తే..కంపెనీలు తయారీ కాకుండా.. భద్రతపై దృష్టిసారించి..ఉత్పత్తి అనుకున్నంతగా చేయలేవని నిపుణులు అంటున్నారు.    

30 రోజుల్లో ఆరు వెహికల్స్‌ దగ్ధం
దేశ వ్యాప్తంగా గత ముప్పై రోజుల్లో దాదాపు అర డజను ఎలక్ట్రిక్ బైక్స్‌ అగ్నికి ఆహుతైనట్లు రిపోర్ట్‌లు హైలెట్‌ చేస్తున్నాయి. ఏప్రిల్ 9న మహారాష్ట్రలోని నాసిక్‌లో కంటైనర్‌లో లోడ్ చేసిన జితేంద్ర న్యూ ఈవీ టెక్‌కు చెందిన 20 వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. వీటితో పాటు ఓలా ఎలక్ట్రిక్, ప్యూర్ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ ఉన్నాయి.  

నో రీకాల్‌..కానీ
ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ దగ్ధమవ్వడంపై..ప్రభుత్వం ఈ సమయంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను రీకాల్ చేయాలని ఆదేశించడంపై కేంద్రం ఆలోచించడం లేదని, బదులుగా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, డీఆర్‌డీఓ ల్యాబ్‌లో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదాలపై నిజ నిర్ధారణ పరిశోధనల రిపోర్ట్‌ల కోసం ఎదురు చూస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.   

గిరిధర్ అరమనే ఏం చెప్పారు
అంతకుముందు, ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ ప్రమాదాలపై..కేంద్రం వినియోగదారుల భద్రతకు కట్టుబడి ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో దిద్దుబాటు చర్యలు తీసుకుంటుందని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి గిరిధర్ అరమనే చెప్పారు.

చదవండి: టపా టప్‌: వరుసగా పేలుతున్న ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌! కారణం అదేనా!

మరిన్ని వార్తలు