నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. త్వరలో 10 లక్షల ఉద్యోగాలు!

18 Oct, 2022 07:19 IST|Sakshi

భర్తీ చేసే ప్రణాళికను రూపొందించండి 

పీఎస్‌యూలకు సూచించిన కేంద్రం

న్యూఢిల్లీ: నిరుద్యోగితపై ఆందోళన పెరుగుతున్న నేపథ్యంలో పోస్టుల భర్తీపై కేంద్రం మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా ఖాళీ పోస్టుల వివరాలు ఇవ్వాలంటూ ప్రభుత్వ రంగ సంస్థలకు (పీఎస్‌యూ) సూచించింది. వాటిని సత్వరం భర్తీ చేసేందుకు మార్గదర్శ ప్రణాళికను రూపొందించుకోవాలని ఆదేశించింది. ఎంట్రీ స్థాయితో పాటు సీనియర్‌ లెవెల్‌ ఖాళీల వివరాలను కూడా కేంద్రం అడిగినట్లు ఒక పీఎస్‌యూ సీనియర్‌ అధికారి తెలిపారు. డిసెంబర్‌ వరకు గుర్తించిన ఎంట్రీ–లెవెల్‌ ఖాళీలను వచ్చే ఏడాది ఆగస్టు–సెప్టెంబర్‌ కల్లా భర్తీ చేయాలని ఆదేశాలు వచ్చినట్లు వివరించారు.

చదవండి: ఆ కారు క్రేజ్‌ వేరబ్బా, రెండేళ్లు వెయిటింగ్‌.. అయినా అదే కావాలంటున్న కస్టమర్లు!

సాధారణంగా నిర్దిష్ట మార్గదర్శకాలకు అనుగుణంగా పారదర్శక విధానంలో నియామకాలు చేపట్టాల్సి ఉండటం, దేశవ్యాప్తంగా అభ్యర్థులు పాల్గొనడం వంటి అంశాల కారణంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో హైరింగ్‌ ప్రక్రియకు కాస్త ఎక్కువ సమయమే పడుతుందని ఆయన పేర్కొన్నారు. అధికారిక గణాంకాల ప్రకారం 2021 ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి దేశవ్యాప్తంగా 255 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు (సీపీఎస్‌ఈ) ఉన్నాయి. వీటిలో 177 సంస్థలు లాభాల్లో ఉన్నాయి. ఇవి 2021 ఆర్థిక సంవత్సరంలో రూ. 1.89 లక్షల కోట్ల లాభాలు నమోదు చేశాయి.

వచ్చే ఏడాదిన్నర వ్యవధిలో యుద్ధప్రాతిపదికన 10 లక్షల మంది ఉద్యోగుల రిక్రూట్‌మెంట్‌ చేపట్టాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ వివిధ శాఖలు, విభాగాలకు జూన్‌లో ఆదేశించారు. దీనికి అనుగుణంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో (పీఎస్‌బీ) ఖాళీల భర్తీ కోసం కేంద్ర ఆర్థిక శాఖ గత నెలలోనే ఆయా బ్యాంకులు, ఆర్థిక సంస్థల చీఫ్‌లతో సమావేశమైంది. దీంతో బ్యాంకులు రిక్రూట్‌మెంట్‌ కోసం ప్రకటనలు జారీ చేయడం కూడా మొదలుపెట్టాయి. 2012–13లో పీఎస్‌బీల్లో 8.86 లక్షల మంది ఉద్యోగులు ఉండగా 2020–21 నాటికి ఇది 7.80 లక్షలకు తగ్గింది.

చదవండి: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌: ఊహించని షాక్‌.. తలలు పట్టుకుంటున్న ఐటీ కంపెనీలు!

మరిన్ని వార్తలు