ఆ పిల్ల‌ల‌కు రూ.10 లక్షలు! గ‌డువు తేదీని పెంచిన కేంద్రం..అర్హులు ఎవ‌రంటే?

23 Feb, 2022 14:37 IST|Sakshi

క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి బాధిత కుటుంబాల‌కు చెందిన పిల్ల‌ల‌కు అండ‌గా నిలిచేందుకు కేంద్రం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ విభాగానికి చెందిన పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్ గ‌డువు తేదీని  ఫిబ్రవరి 28, 2022 వరకు పొడిగించిన‌ట్లు కేంద్రం అధికారికంగా తెలిపింది. ఇంతకుముందు ఈ పథకం కింద ప్ర‌యోజ‌నం పొందే ల‌బ్ధిదారులు అప్ల‌య్ చేసేందుకు గ‌డువు తేదీని  డిసెంబర్ 31, 2021 వరకు విధించింది. ఇప్పుడు ఈ గ‌డువు తేదీని పెంచుతూ కేంద్రం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.  

కోవిడ్ కారణంగా తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన పిల్లలకు గ‌తేడాది మే 29న ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ  సహాయాన్ని ప్రకటించారు. క‌రోనాతో తల్లిదండ్రులు, లేదంటే వారి ఇత‌ర కుటుంబ‌స‌భ్యుల్ని కోల్పోయి అనాద‌లైన పిల్ల‌ల‌కు అండ‌గా నిలించేందుకు పీఎం కేర్స్ ఫ‌ర్ చిల్డ్ర‌న్ స్కీమ్‌ను ప్రవేశ పెట్టారు. ఈ స్కీమ్‌లో భాగంగా తల్లిదండ్రులు మరణించిన తేదీ నాటికి పిల్లలకు 18 ఏళ్లు నిండని పిల్ల‌ల చ‌దువు, ఆరోగ్యం ఇత‌రాత్ర అన్నీ ప్ర‌యోజ‌నాల్ని అందించేలా కేంద్రం చ‌ర్య‌లు తీసుకుంది. ఈ ప‌థ‌కం కింద అర్హులైన పిల్ల‌ల‌కు 18 సంవత్సరాల వయస్సు నిండిన త‌ర్వాత‌ నెలవారీ స్టైఫండ్ చొప్పున  23 సంవత్సరాల వయస్సు వ‌చ్చే వ‌ర‌కు రూ.10 లక్షల మొత్తాన్ని అందిస్తుంది.

ఈ పథకాన్ని ఆన్‌లైన్ పోర్టల్ https://pmcaresforchildren.in ద్వారా యాక్సెస్ చేయవచ్చు. ఫిబ్రవరి 28, 2022 వరకు పోర్టల్‌లో అర్హులైన పిల్లలను గుర్తించి, నమోదు చేసుకోవాలని అన్ని రాష్ట్రాలు/యూటీల‌కు చెందిన ల‌బ్ధి దారుల్ని కేంద్రం కోరింది.

మరిన్ని వార్తలు