e-Shram: కార్మికులకు అండగా ఇ-శ్రమ్‌

25 Aug, 2021 14:29 IST|Sakshi

అసంఘటిత రంగంలో అనామకంగా ఉండిపోయిన కార్మికలకు అండగా నిలించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త కార్యక్రమాన్ని చేపట్టనుంది. సంక్షేమం, ఉపాధి, ప్రభుత్వ పథకాలు తదితర అంశాల్లో కార్మికులకు సహాయకారిగా ఉండేందుకు ఇ శ్రమ్‌ పేరుతో పోర్టల్‌ని ప్రారంభించనుంది.

ఎంతమంది కార్మికులు
భారత దేశంలో అసంఘటిత రంగంలో దాదాపు 38 కోట్ల మంది కార్మికులు ఉన్నట్టు అంచనా. కోవిడ్‌ సంక్షోభం సమయంలో లాక్‌డౌన్‌ విధించినప్పుడు వీరంతా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఊరుకాని ఊరిలో ఇటు యజమానులు, అటు ప్రభుత్వ మద్దుతు సరైన సమయంలో అందక ఇక్కట్ల పాలయ్యారు. దీంతో ఇటు పౌర సమాజం, అటు న్యాయస్థానాల నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. అసంఘటిత కార్మికులు ఎంత మంది ఉన్నారు, సంక్షేమ పథకాలు ఎలా అందించాలనే అంశంపై నిర్థిష్ట కార్యాచరణ ప్రకటించాల్సిన అవసరం ఏర్పడింది.

ఇ-శ్రమ్‌
అసంఘటిత రంగంలో ఉన్న కార్మికుల సంక్షేమం లక్ష్యంగా కేంద్రం ఆగస్టు 26న ఇ శ్రమ్‌ వెబ్‌ పోర్టల్‌ని అందుబాటులోకి తేనుంది. ఆధార్‌కార్డు ఆధారంగా కార్మికులు తమ వివరాలను ఈ పోర్టల్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దీని వల్ల అసంఘటిత రంగంలో ఎంత మంది కార్మికులు ఉన్నారు. వీరిలో నిర్మాణ రంగం, వలస కార్మికులు, వీధి వ్యాపారులు ఇలా కేటగిరిల వారీగా ఎంత మంది ఉన్నారనే సమాచారం ప్రభుత్వానికి అందుతుంది. అదే విధంగా ఆయా కేటగిరిల కింద ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కార్మికులకు అందించే వీలు కలగనుంది.

ఒకే గొడుకు కిందికి
ఇ శ్రమ్‌ పోర్టల్‌ అందుబాటులోకి రావడం వల్ల ఇటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కార్మిక సంఘాలు కూడా ఒకే గొడుకు కిందకు వచ్చే అవకావం ఉంది. దీని వల్ల కార్మికుల సమస్యల వెలుగులోకి రావడంతో పాటు సమస్యల పరిష్కారం సైతం త్వరగా జరిగేందుకు వీలు ఏర్పడనుంది. ఆగస్టు 26న పోర్టల్‌ ప్రారంభించినప్పటి నుంచే రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని కేంద్ర కార్మిక శాఖ తెలిపింది.

కార్మికుల కోసం హెల్ప్‌లైన్‌
ఇ శ్రమ్‌ వెబ్‌ పోర్టల్‌తో పాటు అసంఘటిత కార్మికుల కోసం కార్మిక శాఖ హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేయనుంది. అందులో భాగంగా 14434 నంబరును దేశవ్యాప్తంగా కార్మికులకు అందుబాటులోకి తేనుంది. 
 

చదవండి: JioMeet : ఆన్‌లైన్‌ క్లాసుల కోసం జియోమీట్‌.. ఇప్పుడు ప్రాంతీయ భాషల్లో

మరిన్ని వార్తలు