DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త?!

10 Mar, 2022 21:27 IST|Sakshi

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త చెప్పనుంది. హోలీ పండుగ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్నెస్‌ అలవెన్స్‌ (డీఏ) పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై మార్చి 16న కేంద్రం కేబినెట్‌ సమావేశం నిర్వహించనుందని, ఈ భేటీ అనంతరం డీఏపై స్పష్టమైన ప్రకటన వెలువడనుందని కొన్ని నివేదికలు వెలుగులోకి వచ్చాయి.   

డీఏ ఎంత పెరుగుతుందనే అంశంపై కేంద్రం స్పష్టత ఇవ్వనప్పటికీ  ప్రస్తుతం ఉన్న 31శాతం డీఏను 34శాతానికి పెంచే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఒక వేళ కేంద్ర ప్రభుత్వం డీఏ పెంపుపై అధికారిక ప్రకటన చేస్తే.. 50 లక్షల మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షలకుపైగా పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది.

డీఏ పెంపుతో శాలరీ ఎంత పెరుగుతుంది?
ఈ సారి ప్రకటనలో 3 శాతం డీఏ పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే ఉద్యోగుల సగటు వేతనం కనీసం రూ.6,480 నుంచి.. అత్యధికంగా రూ.20 వేల వరకు పెరగొచ్చని తెలుస్తోంది. ఒక ఉద్యోగి బేసిస్​ శాలరీ రూ.18,000 ఉంటే..కొత్త డీఏ (34 శాతం) వాటా రూ.6,120గా ఉంటుంది. ప్రస్తుతం 31 శాతం డీఏ (రూ.5,580) వస్తోంది.

చదవండి: గ్యాప్ తీసుకోలేదు..వచ్చింది అంతే! ఎలన్‌ మస్క్‌ యుద్ధం వచ్చినా ఆగేలా లేడే!

మరిన్ని వార్తలు