BPCL Privatization: భారత్‌ పెట్రోలియం అమ్మకానికి బ్రేక్‌!

9 Jun, 2022 07:59 IST|Sakshi

బీపీసీఎల్‌ అమ్మకానికి చెక్‌

అన్ని చర్యలనూ నిలిపివేసిన ప్రభుత్వం  

న్యూఢిల్లీ: ఇంధన రంగ పీఎస్‌యూ దిగ్గజం భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌(బీపీసీఎల్‌) ప్రయివేటైజేషన్‌ను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిలిపివేసింది. డిజిన్వెస్ట్‌మెంట్‌ కోసం తీసుకున్న అన్ని చర్యలకూ ప్రభుత్వం మంగళంపాడినట్లు బీపీసీఎల్‌ తాజాగా వెల్లడించింది. కంపెనీలోగల 53 శాతం వాటా విక్రయానికి చేపట్టిన ప్రస్తుత టెండర్‌ను ఈ నెల 3న ప్రభుత్వం రద్దు చేసినట్లు స్టాక్‌ ఎక్సే్ంజీలకు తెలియజేసింది. దీంతో డేటా రూమ్‌ వివరాలుసహా డిజిన్వెస్ట్‌మెంట్‌ సంబంధ అన్ని సన్నాహాలనూ నిలిపివేసిందని వివరించింది.

కారణం
ప్రధానంగా కంపెనీ కొనుగోలుకి ఆసక్తి వ్యక్తం(ఈవోఐ) చేసిన మూడు బిడ్డర్లలో రెండు సంస్థలు వెనక్కి తగ్గడం ప్రభావం చూపింది. అర్హత సాధించిన సంస్థల కోసం గతేడాది ఏప్రిల్‌లో కంపెనీకి సంబంధించిన ఆర్థిక సమాచార వేదిక వర్చువల్‌ డేటా రూమ్‌కు బీపీసీఎల్‌ తెరతీసిన విషయం విదితమే. సాధ్యాసాధ్యాల పరిశీలన తదుపరి వాటా కొనుగోలు ఒప్పందానికి సంసిద్ధతను వ్యక్తం చేయవలసి ఉంటుంది. ఆపై ప్రభుత్వం ఫైనాన్షియల్‌ బిడ్స్‌ను ఆహ్వానిస్తుంది. అయితే ఈ దశవరకూ ప్రక్రియ వెళ్లకపోవడంతో ప్రభుత్వం డిజిన్వెస్ట్‌మెంట్‌ను విరమించుకుంది. 

చదవండి: వినియోగదారులకు షాక్‌:హెచ్‌డీఎఫ్‌సీ రెండో ‘వడ్డింపు’

మరిన్ని వార్తలు