పసిడి లవర్స్‌కు భారీ షాక్‌, కేంద్రం సంచలన నిర్ణయం

1 Jul, 2022 14:01 IST|Sakshi

సాక్షి,ముంబై: అంతర్జాతీయంగా భగ్గుమంటున్న ముడి చమురు ధరలు, దేశీయంగా నెలకొన్న కొరత, వినియోగదారుల ఆందోళన నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.పెట్రోల్, డీజిల్‌పై ఎగుమతి పన్ను, దేశీయ ముడిచమురు ఉత్పత్తిపై విండ్‌ఫాల్ పన్ను విధించింది.దీంతోపాటు పసిడిదిగుమతులకు కళ్లెం వేసేందుకు కూడా ఆర్థికమంత్రిత్వశాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. అధిక బంగారం దిగుమతులు కరెంట్ ఖాతా లోటుపై ఒత్తిడి పెంచుతున్న ఆందోళనల నేపథ్యంలో బంగారంపై దిగుమతి సుంకాన్ని 10.75 శాతం నుంచి 15 శాతానికి పెంచింది. ఈ మేరకు  ఆర్థికమంత్రిత్వ శాఖ శుక్రవారం ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. 

ఇది కూడా చదవండి:  కేంద్రం కొత్త పన్నుల షాక్‌, రిలయన్స్‌,ఓఎన్‌జీసీ ఢమాల్‌!​

బంగారం దిగుమతులు ఒక్కసారిగా పెరడంతో బంగారం డిమాండ్‌ను తగ్గించాలనే లక్ష్యంతో తాజా నిర్ణయం తీసుకుంది. మే నెలలో మొత్తం 107 టన్నుల బంగారం దిగుమతి కాగా జూన్‌లో కూడా గణనీయంగా దిగుమతులు పెరిగినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది.  బంగారం దిగుమతులు పెరగడం కరెంట్ ఖాతా లోటుపై ఒత్తిడి పెంచుతోంది. దీంతో కస్టమ్స్ సుంకాన్ని పెంచివేసింది. గతంలో బంగారంపై ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ 7.5 శాతం ఉండగా, ఇప్పుడు 12.5 శాతానికి చేరనుంది. దీనికి 2.5 శాతం వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి పన్నుతో కలిపి బంగారంపై బేసిక్‌ కస్టమ్స్ డ్యూటీ 15 శాతానికి చేరింది. దీనికి 3 శాతం జీఎస్‌టీ  అదనపు భారం. తాజా నిర్ణయంతో ఎంసీఎక్స్‌ మార్కెట్లో బంగారం ధరలు పుంజుకున్నాయి. 

కాగా ఇంధన దిగుమతులు,ఎగుమతులను నియంత్రించే చర్యల పరంపరలో, ప్రభుత్వం పెట్రోల్ , డీజిల్ ఎగుమతులపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాలను విధించింది. పెట్రోలుపై లీటరుకు రూ.6 డీజిల్‌పై లీటరుకు రూ.13 పన్ను విధించింది. ముడి చమురుపై టన్నుకు రూ.23,250 (ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం) లేదా విండ్‌ఫాల్ పన్ను విధించింది.  ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ఎగుమతులపై లీటరుకు రూ. 6 ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం విధించింది. ప్రపంచంలో రెండో అతిపెద్ద పసిడి వినియోగదారుగా ఉన్న ఇండియా  బంగారం డిమాండ్‌లో చాలా వరకు దిగుమతుల ద్వారానే.  ఇది రూపాయిపై ఒత్తిడి పెంచుతోంది. ఫలితంగా దేశీయ కరెన్సీ రోజుకో  రికార్డు కనిష్టానికి చేరుతున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు