న్యూఢిల్లీ: కలర్ టీవీల ధరలకు రెక్కలు రానున్నాయి! ఎందుకంటే కలర్ టీవీల దిగుమతులపై నియంత్రణలు విధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా దేశీయ తయారీని ప్రోత్సహించడంతోపాటు.. చైనా నుంచి వచ్చి పడుతున్న నిత్యావసరం కాని వస్తువులకు కళ్లెం వేయడమే కేంద్రం నిర్ణయం వెనుక ఉద్దేశ్యంగా ఉంది.
ఇప్పటి వరకు కలర్ టెలివిజన్లను స్వేచ్ఛగా దిగుమతి చేసుకునేందుకు అవకాశం ఉండగా, ఇకపై నియంత్రణ పరిధిలోకి తీసుకొచ్చినట్టు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారీన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) విభాగం ప్రకటన జారీ చేసింది. 32 సెంటీమీటర్ల నుంచి 105 సెంటీమీటర్ల పరిమాణంలోని తెరలు కలిగిన టీవీలు, 63 సెంటీమీటర్ల కంటే తక్కువ పరిమాణంలోని ఎల్సీడీ టీవీలు నియంత్రణ పరిధిలోకి వస్తాయి. నియంత్రణతో ఇకపై వీటిని దిగుమతి చేసుకోవాలంటే తప్పకుండా కేంద్ర వాణిజ్య శాఖ పరిధిలోని డీజీఎఫ్టీ నుంచి లైసెన్స్ పొదాల్సిందే.