ఇ బస్‌లతో నెరవేరనున్న డబుల్‌ డెక్కర్‌ కల

21 Jan, 2022 09:01 IST|Sakshi

5,580 ఎలక్ట్రిక్‌ బస్సుల కోసం రూ. 5,500 కోట్ల భారీ టెండర్‌ 

హైదరాబాద్‌కు రానున్న ఈ–బస్సులు 

సీఈఎస్‌ఎల్‌ ప్రకటన  

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ కన్వర్జెన్స్‌ ఎనర్జీ సర్వీ సెస్‌ లిమిటెడ్‌ (సీఈఎస్‌ఎల్‌) 5,580 ఎలక్ట్రిక్‌ బస్సుల కొనుగోలుకు సంబంధించి 5,500 కోట్ల విలువైన భారీ టెండర్‌ను ప్రకటించింది. ఇందులో 130 డబుల్‌ డెక్కర్‌ బస్సులు కూడా భాగంగా ఉన్నాయి. ఎనర్జీ ఎఫీషియెన్సీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఈఈఎస్‌ఎల్‌) అనుబంధ సంస్థే సీఈఎస్‌ఎల్‌. ఆసక్తి కలిగిన పార్టీల నుంచి ప్రతిపాదనలకు ఆహ్వానం పలికింది.

ఫస్ట్‌ ఫేజ్‌లో
 ‘గ్రాండ్‌ చాలెంజ్‌’ కింద తొలి దశలో హైదరాబాద్, బెంగళూరు, సూరత్, కోల్‌కతా పట్టణాలకు ఈ ఏడాది జూలై నాటికే ఈ–బస్సులు అందుబాటులోకి వస్తాయని సీఈఎస్‌ఎల్‌ పేర్కొంది. ప్రపంచంలో ఇదే అతిపెద్ద పథకమని సీఈఎస్‌ఎల్‌ ఎండీ, సీఈవో మహువా ఆచార్య పేర్కొన్నారు. అస్సెట్‌ లైట్‌ నమూనా కావడంతో రాష్ట్ర రవాణా సంస్థలు ఈ బస్సులను అందుబాటు ధరలకే, అధిక సంఖ్యలో నడిపించడం సాధ్యపడుతుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాల ఈ–బస్సుల లక్ష్యాల సాధనకు తమ వంతు సహకారం అందిస్తామన్నారు. కర్బన ఉద్గారాల్లో భారత్‌ను తటస్థంగా సున్నా స్థాయికి చేర్చే లక్ష్యానికి ఇది తోడ్పడుతుందని సీఈఎస్‌ఎల్‌ పేర్కొంది.  

డబుల్‌ డెక్కర్‌
హైదరాబాద్‌ నగరంలో డబుల్‌ డెక్కర్‌ బస్సులు నడిపించాలంటూ మంత్రి కేటీఆర్‌ను ఓ నెటిజన్‌ కోరగా.. వెంటనే ఈ విషయాన్ని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ని దృష్టికి కేటీఆర్‌ తీసుకెళ్లారు. ఈ మేరకు  డబుల్‌ డెక్కర్‌ బస్సులు కొనేందుకు ఆర్టీసీ టెండర్లను సైతం ఆహ్వానించింది. ఆ తర్వాత పలు కారణాల వల్ల  డబుల్‌ డెక్కర్‌ బస్సులు రోడ్డెక్కే విషయంలో జాప్యం చోటు చేసుకుంది. అయితే ఇప్పుడు సీఈఎస్‌ఎల్‌ సంస్థ దాదాపు 130 డబుల్‌ డెక్కర్‌ బస్సులు కొనుగోలు చేయడంతో మరోసారి ఆశలు చిగురించాయి. 

చదవండి: డబుల్‌ డెక్కర్‌ బస్సులు కొనాలంటే కష్టం.. అద్దెకే ఇష్టం!

మరిన్ని వార్తలు