భారత్‌లో బీవైడీ అటో–3

12 Oct, 2022 14:45 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వాహన తయారీలో ఉన్న చైనా దిగ్గజం బీవైడీ.. భారత్‌లో తాజాగా ఎలక్ట్రిక్‌ స్పోర్ట్స్‌ యుటిలిటీ వెహికిల్‌ అటో–3 ఆవిష్కరించింది. ఒకసారి చార్జింగ్‌తో 521 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. 7 ఎయిర్‌బ్యాగ్స్‌ పొందుపరిచారు. ఆటోమేటిక్‌ ఎమర్జెన్సీ బ్రేకింగ్, బ్లైండ్‌ స్పాట్‌ మానిటరింగ్, లేన్‌–కీప్‌ అసిస్ట్, అడాప్టివ్‌ క్రూజ్‌ కంట్రోల్, రెండు వైపులా కొలీషన్‌ వార్నింగ్, ఏబీఎస్, ఈఎస్‌సీ, ట్రాక్షన్‌ కంట్రోల్‌ వంటి ఫీచర్లను జోడించారు.

ధరను ఇంకా ప్రకటించాల్సి ఉంది. రూ.50,000 చెల్లించి బుక్‌ చేసుకోవచ్చు. డెలివరీలు 2023 జనవరి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే బీవైడీ భారత్‌లో మల్టీ పర్పస్‌ ఎలక్ట్రిక్‌ వెహికిల్‌ ఈ6ను విక్రయిస్తోంది.


2030 నాటికి భారత ఎలక్ట్రిక్‌ వాహన విపణి 55 లక్షల యూనిట్లకు చేరుతుందన్న అంచనాలు ఉన్నాయని బీవైడీ ఇండియా సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సంజయ్‌ గోపాలకృష్ణన్‌ తెలిపారు. ఆ సమయానికి 30 శాతం వాటా లక్ష్యంగా చేసుకున్నట్టు వెల్లడించారు. చెన్నై ప్లాంటులో ఎస్‌యూవీని అసెంబుల్‌ చేస్తామన్నారు.

మార్కెట్‌ డిమాండ్‌నుబట్టి తయారీ కేంద్రం ఏర్పాటు చేసే అవకాశం ఉందని వెల్లడించారు. బీవైడీ తయారీ 800లకుపైగా ఎలక్ట్రిక్‌ బస్సులు భారత్‌లో 11 నగరాల్లో పరుగెడుతున్నాయని వివరించారు.

చదవండి: టాటా టియాగో ఈవీకి రెస్పాన్స్‌ అదిరింది.. రికార్డ్‌ బుకింగ్స్‌తో షాకైన కంపెనీ!

మరిన్ని వార్తలు