పెద్ద పన్నాగమే పన్నిన చైనా...!

14 Aug, 2021 15:36 IST|Sakshi

కాలిఫోర్నియా: భారత్‌ను ఎదుర్కొవాలనే కుతంత్రంతో చైనా పలు విషయాల్లో పాకిస్థాన్‌కు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. కరోనా సమయంలో కూడా పాకిస్థాన్‌కు సహాయాన్ని అందించింది. పాకిస్థాన్‌ పౌరులకు వ్యాక్సిన్‌ అందించడంలో కూడా చైనా ముందే ఉంది. పాకిస్థాన్‌ కుటీల రాజకీయాల వల్ల ఆ దేశాన్ని ఫైనాన్షిల్‌ యాక్షన్‌ టాస్క్‌ ఫోర్స్‌లో భాగంగా పాకిస్థాన్‌ను అమెరికా గ్రే లిస్ట్‌లో పెట్టిన విషయం తెలిసిందే.

పాకిస్థాన్‌కు అందించే ఆర్థిక సహాయాన్ని కూడా అమెరికా పూర్తిగా నిలిపివేసింది. దీంతో డ్రాగన్‌ దేశంతో పాకిస్థాన్‌ మరింత దగ్గరైంది. చైనాతో చేస్తోన్న దోస్తీ ఇప్పుడు పాకిస్థాన్‌ కొంపముంచేలా ఉంది. చైనాకు చెందిన టెక్‌ దిగ్గజం హువావే పాకిస్థాన్‌ ప్రజలపై నిఘా పెట్టిన్నట్లు తెలుస్తోంది. పాకిస్థాన్‌కు చెందిన సున్నితమైన డేటాను హువావే యాక్సెస్‌ చేసిందని వార్తలు వస్తున్నాయి. హువావే కంపెనీ పాకిస్థాన్‌ దేశానికి చెందిన వాణిజ్య రహస్యాలను దొంగిలించి పాకిస్తానీయులపై నిఘా పెట్టిందని  అమెరికాకు చెందిన సాఫ్ట్‌వేర్‌ కంపెనీ బిజినెస్‌ ఎఫిషియెన్సీ సోల్యూషన్స్‌ ఆరోపించింది.

పాకిస్థాన్‌ ప్రభుత్వం కోసం బిజినెస్‌ ఎఫిషియెన్సీ సోల్యూషన్స్‌ ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌ను తయారు చేసింది. సాఫ్ట్‌వేర్‌ పూర్తైన తరువాత పాకిస్థాన్‌ దేశపు సమాచారాన్ని ట్రయల్‌ రన్‌ కోసం బీజింగ్‌కు పంపింది. ఇప్పటివరకు హువావే పాకిస్థాన్‌కు చెందిన సమాచారాన్ని తిరిగి ఇవ్వలేదని బిజినెస్‌ ఎఫిషియెన్సీ సోల్యూషన్స్‌ ఆరోపించింది. ఈ విషయంపై బిజినెస్‌ ఎఫిషియెన్సీ సోల్యూషన్స్‌ కాలిఫోర్నియా కోర్టులో హువావేపై విచారణ చేయాలని ఆరోపించింది.

బీఈఎస్‌ తన పిటిషన్‌లో పాకిస్థాన్‌కు చెందిన కీలక సమాచారాన్ని హువావే బ్యాక్‌డోర్‌ ద్వారా  గ్రహిస్తుందని పేర్కొంది. చైనా కేవలం పాకిస్థాన్‌పై నిఘా ఉంచిదనుకుంటే పొరపాటే..! మిడిల్‌ ఈస్ట్‌ దేశాలపై కూడా చైనా సైబర్‌ దాడులను చేస్తోందని సైబర్‌సెక్యూరిటీ సంస్థ ఫైర్‌ఐ వెల్లడించింది.  పాకిస్థాన్‌ కీలక సమాచారం, ఆ దేశ ప్రజల సమాచారాన్ని సేకరించి పూర్తిగా పాకిస్థాన్‌ దేశాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకునేలా చైనా ప్రయత్నిస్తోంది.

మరిన్ని వార్తలు