China: ఆన్‌ లైన్‌ వీడియో గేమ్స్‌పై చైనా కఠిన ఆంక్షలు.. కారణం ఇదే

31 Aug, 2021 11:19 IST|Sakshi

ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసైన పిల్లలు కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారు. ఆటల మోజులో పడి విద్యార్థులు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అందుకే చైనా ఆన్‌ లైన్‌ వీడియో గేమ్స్‌పై ఆంక్షలు విధించింది. 

సెప్టెంబర్‌ 1 నుంచి 18 ఏళ్లలోపు పిల్లలు వారంలో కేవలం 3 గంటలు మాత్రమే ఆన్‌లైన్‌ వీడియో గేమ్స్‌ ఆడుకునేలా చైనా ప్రభుత్వం కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు  ఉత్తర్వులు జారీ చేసింది. నేషనల్‌ ప్రెస్‌ అండ్‌ పబ్లికేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ (NPPA) సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి శుక్రవారాలు, వీకెండ్స్‌, ప్రభుత్వ సెలవు దినాల్లో మాత్రం రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు గేమ్స్‌ ఆడుకొనేలా అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపింది 

ఇదిలా ఉంటే చైనా ఇలా వీడియో గేమ్స్‌పై నిబంధనలు విధించడం ఇదే తొలిసారి కాదు 2019లో రోజుకు గంటన్నర, ప్రభుత్వ సెలవు దినాల్లో మూడు గంటల చొప్పున ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడుకునే అవకాశాన్ని కలిపించింది.

చైనా ప్రభుత్వంపై అసంతృప్తి
చైనా ప్రభుత్వం వీడియో గేమ్స్‌పై విధించిన ఆంక్షలపై స్థానిక గేమింగ్‌ కంపెనీలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. గేమింగ్‌ రీసెర్చ్‌ సంస్థ 'వెంచర్‌ బీట్‌' రిపోర్ట్‌-2020   ప్రకారం..2020 సంవత్సరం నాటికి చైనాలో 727 మిలియన్ల మంది ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడుతుండగా.. వారిలో 97శాతం మంది 18 నుంచి 24ఏళ్లలోపు వాళ్లే అధికంగా ఉన్నారు. అయితే తాజాగా ప్రభుత్వ నిర్ణయం అక్కడి గేమింగ్‌ కంపెనీ యాజమాన్యాల గొంతులో చిక్కిన పచ్చి వెలక్కాయ సమస్యలా మారింది.

కాగా, 727 మిలియన్ల మంది వీడియో గేమ్‌ ఆడగా గేమింగ్‌ కంపెనీలకు వచ్చే ఆదాయం 41బిలియన్ డాలర్లుగా ఉంది. 2020లో 727 మిలియన్ల మంది గేమ్‌ ఆడుతుండగా 2021 ఆ సంఖ్య 743.5మిలియన్‌ డాలర్లకు చేరింది. ప్రస్తుత గణాంకాల ప్రకారం.. 2025నాటికి చైనాలో గేమ్‌ ఆడేవారి సంఖ్య 781.7 మిలియన్లకు చేరుతుందని వెంచర్‌ బీట్‌ అంచనా వేసింది. దీన్ని క్యాష్‌ చేసుకునేందుకు డ్రాగన్‌ కంట్రీకి చెందిన వీడియో గేమింగ్‌ కంపెనీలు భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టాయి. ఈ తరుణంలో చైనా ప్రభుత్వ నిర్ణయం గేమింగ్‌ కంపెనీలకు పెద్ద తలనొప్పిగా మారినట్లైంది.

చదవండి : ఐపీఓకి ఓలా,వేల కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంగా సన్నాహాలు 

మరిన్ని వార్తలు