ఉద్యోగులకు ఊహించని షాక్‌!..ట్విటర్‌,మెటా బాటలో మరో దిగ్గజ సంస్థ!

19 Nov, 2022 16:16 IST|Sakshi

ఆర్ధిక మాంద్యం ముంచుకొస్తుందనే ఆందోళనతో స్టార్టప్‌ల నుంచి అంతర్జాతీయ సంస్థల వరకు పొదుపు మంత్రాన్ని జపిస్తున్నాయి. మాంద్యం వచ్చిన తర్వాత జాగ్రత‍్త పడే కంటే.. వచ్చే ప్రమాదాన్ని ముందే పసిగట్టి అందుకు అనుగుణంగా సన్నంద్ధం అవ్వడం మంచిదని భావిస్తున్నాయి. ఈ తరుణంలో ప‍్రముఖ టెలికం పరికరాల తయారీ సంస్థ సిస్కో భారీ ఎత్తున ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపనున్నట్లు తెలుస్తోంది. 

మెటా, నెటఫ‍్లిక్స్‌,స్నాప్‌ చాట్‌, అమెజాన్‌ బాటలో సిస్కో ఉద్యోగుల తొలగింపుల్ని ముమ్మరం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఆ సంస్థలో 83 వేలమంది ఉద్యోగులు పనిచేస్తుండగా.. వారిలో 4,100 మంది సిబ్బందిపై వేటు వేస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 

ఈ వారం సిస్కో తన మొదటి త్రైమాసిక ఫలితాల్ని విడుదల చేసింది. 13.6 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని అర్జించినట్లు చెప్పిన సిస్కో.. ఈ ఏడాది ఆదాయం 6 శాతం పెరిగినట్లు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా సిస్కో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ స్కాట్ హెర్రెన్ ఉద్యోగులపై వేటు పున: నిర్మాణం (రీ బ్యాలెన్స్‌)గా అభివర్ణించారు. ఖర్చు తగ్గించుకోవడం కోసమే చూస్తున్నాం. ఉద్యోగుల తొలగింపు మాత్రం అనుకోవద్దు’ అని అన్నారు. కాగా, ఆర్ధిక మాంద్యం నుంచి గట్టెక్కేలా మెటా, ట్విటర్‌, సేల్స్‌ ఫోర్స్‌, మైక్రోసాఫ్ట్‌, స్ట్రైప్‌లు ఉద్యోగులకు పింక్‌ స్లిప్‌ ఇవ్వగా.. ఆ సంస్థల జాబితాలో సిస్కో చేరింది.

చదవండి👉 ‘నా ఉద్యోగం ఉంటుందో..ఊడుతుందో’..టెక్కీలకు చుక్కలు చూపిస్తున్న కంపెనీలు!

మరిన్ని వార్తలు