కాగ్నిజెంట్‌లో 45,000 మంది ఫ్రెషర్లు ఉద్యోగాలు.. ఎప్పుడంటే?

29 Oct, 2021 05:01 IST|Sakshi

భారత్‌లో 45,000 మంది ఫ్రెషర్లకు ఉద్యోగాల

న్యూఢిల్లీ: ప్రముఖ ఐటీ కంపెనీ, అమెరికా కేంద్రంగా పనిచేసే కాగ్నిజంట్‌ సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో మెరుగైన పనితీరు చూపించింది. సంస్థ నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 56 శాతం పెరిగి 544 మిలియన్‌ డాలర్లు (రూ.4,080 కోట్లు)గా ఉంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో (2020 సెప్టెంబర్‌ త్రైమాసికం) నికర లాభం 348 మిలియన్‌ డాలర్లుగా ఉండడం గమనార్హం. కంపెనీ ఆదాయం 12 శాతం పెరిగి 4.7 బిలియన్‌ డాలర్లుగా ఉంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఆదాయం 4.2 బిలియన్‌ డాలర్లుగా ఉండడం గమనార్హం. రూ.4.69–4.74 బిలియన్‌ డాలర్ల మధ్య ఆదాయం ఉండొచ్చన్న గత అంచనాలకు అనుగుణంగానే సంస్థ పనితీరు ఉంది.   

ఫ్రెషర్లకు గుడ్‌న్యూస్‌: అక్టోబర్‌–డిసెంబర్‌ కాలంలో భారత్‌లో కొత్తగా 45,000 మంది గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు ఇవ్వనున్నట్టు కాగ్నిజంట్‌ ప్రకటించింది. నిపుణులకు డిమాండ్‌– సరఫరా మధ్య అంతరం చాలా ఎక్కువగా ఉన్నట్టు పేర్కొంది. వార్షికంగా చూస్తే స్వచ్చంద అట్రిషన్‌ (ఉద్యోగి స్వయంగా సంస్థను వీడడం) రేటు 33 శాతానికి పెరిగినట్టు తెలిపింది. ఈ సంస్థ జనవరి–డిసెంబర్‌ను వార్షిక సంవత్సరంగా పరిగణిస్తుంటుంది. భారత్‌లో కాగ్నిజంట్‌కు 2 లక్షల మంది ఉద్యోగులున్నారు. సెప్టెంబర్‌ త్రైమాసికంలో డిజిటల్‌ విభాగం ఆదాయం 18 శాతం వృద్ధిని చూపించినట్టు  సీఈవో  హంఫైర్స్‌ తెలిపారు.

క్యూ4లో 4.75 డాలర్ల స్థాయిలో..  
నాలుగో త్రైమాసికంలో (2021 అక్టోబర్‌–డిసెంబర్‌) ఆదాయం 4.75–4.79 బిలియన్‌ డాలర్ల మేర ఉండొచ్చన్న అంచనాను కాగ్నిజంట్‌ ఫలితాల సందర్భంగా వ్యక్తం చేసింది. ఇది వార్షికంగా చూస్తే 13.5–14.5 శాతం వృద్ధికి సమానమని వివరించింది. 2021 పూర్తి సంవత్సరానికి ఆదాయం 11 శాతం మేర వృద్ధి చెంది 18.5 బిలియన్‌ డాలర్లుగా ఉండొచ్చని ప్రకటించింది. సంస్థ ఉద్యోగుల సంఖ్య 3,01,300 నుంచి 3,18,400కు పెరిగింది. 

మరిన్ని వార్తలు