-

మార్చి 31లోగా ఈ పనులు పూర్తి చేయండి… లేకపోతే మీకే నష్టం..!

20 Mar, 2022 16:21 IST|Sakshi

ప్రతి ఏడాదిలో కొత్త నెల వచ్చింది అంటే చాలు దేశంలో కొత్త నిబనంధనలు అమలులోకి వస్తాయి. రాబోయే ఏప్రిల్ నెల నుంచి కూడా అనేక కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. ముఖ్యంగా, మార్చి 31కి ఈ ఆర్థిక సంవత్సరం పూర్తి అవుతుంది. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభకానుంది. పాత నిబంధనలు స్థానంలో కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చేస్తాయి. అందుకే, ప్రతిఒక్కరూ తమ ఆర్థిక ప్రణాళిక విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన సమయం కూడా ఇదే. మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న సమయంలో కొన్ని ఆర్థిక ప్రణాళికలకు సంబంధించిన ముఖ్యమైన పనులను తప్పక పూర్తి చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

పన్ను మినహాయింపుల కోసం
ఈ ఆర్థిక సంవత్సరంలో సెక్షన్‌ 80సీ కింద పన్ను మినహాయింపు వర్తించే పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌, జాతీయ పింఛన్‌, జాతీయ ఫించను స్కీమ్‌, సుకన్య సమృద్ధి యోజన, ఈఎల్‌ఎస్‌ఎస్‌ ఇలా అనేక స్కీమ్‌లలో మదుపు చేసేందుకు అవకాశం ఉంది. ఇంకా సెక్షన్‌ 80సీ పరిమితి రూ.1,50,000 పూర్తి కాకపోతే.. అనుకూలమైన పెట్టుబడి స్కీమ్‌ను ఎంచుకోవచ్చు. ఇప్పటికే తీసుకున్న పీపీఎఫ్‌, ఎన్‌పీఎస్‌, ఎస్‌ఎస్‌వై స్కీమ్‌లలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఒకసారైనా మదుపు చేయకపోతే మార్చి 31లోపు తప్పనిసరిగా కనీస మొత్తం అయినా పెట్టుబడి పెడితే మంచిది. 

ఆధార్‌-పాన్‌ లింక్‌
మీరు ఇంకా మీ పాన్‌ నెంబర్‌ను మీ ఆధార్ నెంబర్‌తో లింకు చేయకపోతే మీరు మార్చి 31, 2022 వరకు చేసుకోవచ్చు. ఈ తేదీలోగా లింక్ చేయకపోతే, మీ పాన్ నెంబర్ ఇన్ యాక్టివ్ అయ్యే అవకాశం ఉంది. మీరు రూ.1,000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మీ పాన్ నెంబర్ పనిచేయకపోతే షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ లేదా ఇతర సెక్యూరిటీలు వంటి ఆర్థిక లావాదేవీల్లో పెట్టుబడి పెట్టడానికి మీకు అవకాశం ఉండదు. అలాగే, మీకు ఎటువంటి రుణాలు కూడా రాకపోవచ్చు.

ఐటీఆర్ ఫైలింగ్
ఐటీఆర్ ఫైలింగ్ 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మీరు ఇంకా ఐటీ రిటర్న్ ఫైల్ చేయకపోతే మీకు మరో మంచి అవకాశం ఉంది. లేట్ రిటర్న్ దాఖలు చేయడానికి మీకు మార్చి 31, 2022 వరకు సమయం ఉంది. ఫైల్ చేయకపోతే తర్వాత లావాదేవీల విషయాలలో ఇబ్బందులు ఎదుర్కొవచ్చు. 1961లోని సెక్షన్ 234ఎఫ్ ప్రకారం.. ఐటీ రిటర్న్ ఆలస్యంగా దాఖలు చేయరాదు. అలా చేస్తే.. రూ.10,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. 

కేవైసీ అప్‌డేట్‌
మీ బ్యాంకులో మీ అకౌంట్‌కు కేవైసీ పూర్తి చేసుకోండి. పాన్‌, ఆధార్‌, చిరునామా ధృవీకరణతో పాటు బ్యాంకు అడిగిన ఇతర వివరాలను మార్చి 31లోపు పూర్తి చేసుకోండి.

(చదవండి: ఇక తగ్గేదే లే.. ఈవీ రంగంలో సుజుకి మోటార్ భారీ పెట్టుబడులు!)

మరిన్ని వార్తలు