రూ.1 లక్ష కోట్లకు గృహోపకరణాలు

8 Sep, 2022 06:28 IST|Sakshi

ఈ ఏడాదికి క్రిసిల్‌ అంచనా

ఆదాయం 15–18 శాతం వృద్ధి

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: కంజ్యూమర్‌ డ్యూరబుల్స్‌ (గృహోపకరణాలు) విపణి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో రూ.1 లక్ష కోట్ల మార్కును చేరుతుందని రేటింగ్స్‌ ఏజెన్సీ క్రిసిల్‌ అంచనా వేస్తోంది. ‘కోవిడ్‌ ముందస్తు స్థాయితో పోలిస్తే ఇది 3 శాతం అధికం. వినియోగదార్లు అధిక సామర్థ్యం ఉన్న రిఫ్రిజిరేటర్లు, పూర్తి ఆటోమేటిక్‌ వాషింగ్‌ మెషీన్ల వైపు మళ్లుతున్నారు. ఏసీల విషయంలో కాంపాక్ట్‌ మోడళ్లకు గిరాకీ పెరిగింది. పెద్ద సైజు టీవీల పట్ల కస్టమర్లలో మోజు అధికం అయింది.

ఇక రాగి, అల్యూమినియం, స్టీల్, పాలీప్రొపైలీన్‌ వంటి ముడిపదార్థాల వ్యయం భారం అయినందున లాభాలపై ఒత్తిడి ఉన్నప్పటికీ పరిమాణం పరంగా పరిశ్రమ 2022–23లో రెండంకెల వృద్ధి సాధిస్తుంది. రూపాయి విలువ తగ్గడం కూడా లాభాల క్షీణతకు కారణం అవుతోంది. 45–50 శాతం ముడిపదార్థాలు దిగుమతి అవుతున్నవే. ఇక పరిమాణం 10–13 శాతం దూసుకెళ్లడం ద్వారా ఆదాయం 15–18 శాతం ఎగుస్తుంది. 2021–22లో విలువ పరంగా పరిశ్రమ కోవిడ్‌ ముందస్తు స్థాయికి చేరుకుంది. పట్టణవాసుల ఆదాయం పెరగడం, వ్యవసాయ ఉత్పత్తుల ధర అధికం కావడంతో డిమాండ్‌ను పెంచుతుంది’ అని నివేదిక వివరించింది.

మరిన్ని వార్తలు