క్లాసులు, ఉద్యోగం కంప్యూటర్‌తోనే... 

11 Nov, 2020 10:06 IST|Sakshi

దేశవ్యాప్తంగా 34 లక్షల పీసీలు 

జూలై–సెపె్టంబర్‌లో అమ్మకం 

గతేడాది కంటే 9 శాతం వృద్ధి 

హైదరాబాద్: ఆన్‌లైన్‌ క్లాసులు, వర్క్‌ ఫ్రం హోం.. వెరసి దేశవ్యాప్తంగా పర్సనల్‌ కంప్యూటర్ల (పీసీ) అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. 2020 జూలై–సెబర్‌లో దేశంలో 34 లక్షల యూనిట్ల డెస్క్‌టాప్స్, ల్యాప్‌టాప్స్, వర్క్‌స్టేషన్స్‌ అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 9.2 శాతం అధికం. ఏడేళ్లలో ఒక త్రైమాసికంలో ఈ స్థాయి సేల్స్‌ జరగడం ఇదే తొలిసారి అని ఐడీసీ మంగళవారం వెల్లడించింది. దేశవ్యాప్తంగా 2019 సెపె్టంబర్‌ త్రైమాసికంలో 31 లక్షల పీసీలు విక్రయమయ్యాయి. ప్రభుత్వ, విద్యా సంబంధ ప్రాజెక్టులు తక్కువ ఉండడంతో కమర్షియల్‌ విభాగం 14 లక్షల యూనిట్లకు పరిమితమైంది. కంజ్యూమర్‌ విభాగం ఏకంగా 20 లక్షల యూనిట్లను చేరుకోవడం విశేషం. ఈ విభాగం క్రితం ఏడాదితో పోలిస్తే 41.7 శాతం, జూన్‌ త్రైమాసికంతో పోలిస్తే 167.2 శాతం వృద్ధి సాధించింది. 

సరఫరాను మించిన డిమాండ్‌.. 
పీసీ మార్కెట్లో సరఫరా కంటే డిమాండ్‌ అధికంగా ఉంది. ఒకానొక స్థాయిలో విక్రేతల వద్ద స్టాకు నిండుకుంది. ప్రస్తుత ట్రెండ్‌నుబట్టి చూస్తే అక్టోబర్‌–డిసెంబర్‌ త్రైమాసికంలోనూ అమ్మకాల్లో బలమైన వృద్ధి ఉండొచ్చని అంచనా. మొత్తం విక్రయాల్లో అగ్రస్థానంలో ఉన్న హెచ్‌పీ 28.2 శాతం వాటాను దక్కించుకుంది. లెనోవో 21.7 శాతం, డెల్‌ టెక్నాలజీస్‌ 21.3, ఏసర్‌ గ్రూప్‌ 9.5, ఆసస్‌ 7.5 శాతం వాటాను చేజిక్కించుకున్నాయి. యాపిల్‌ గతేడాదితో పోలిస్తే 19.4 శాతం అధికంగా అమ్మకాలు సాధించింది. ఇప్పటి వరకు అత్యధిక సేల్స్‌తో రికార్డు నమోదు చేసింది. విద్యా సంస్థల్లో ఆన్‌లైన్‌ క్లాసులు కొనసాగనున్నందున పట్టణ ప్రాంతాల్లో నోట్‌బుక్స్‌ డిమాండ్‌ మరింత అధికం కానుందని ఐడీసీ తెలిపింది. భారత్‌లో పీసీల విస్తృతి ఇంకా తక్కువగానే ఉంది. బ్రాడ్‌ బ్యాండ్‌ కనెక్టివిటీ పెరుగుతున్నందున డిమాండ్‌ మరికొన్ని త్రైమాసికాలు బలంగా కొనసాగుతుందని ఐడీసీ ఇండియా ప్రతినిధి భరత్‌ షెనాయ్‌ వ్యాఖ్యానించారు.  

అమ్మకాల్లో నోట్‌బుక్స్‌దే హవా.. 
మొత్తం పీసీ విక్రయాల్లో నోట్‌బుక్స్‌దే అగ్రస్థానం. సెపె్టంబర్‌ క్వార్టర్‌లో గతేడాదితో పోలిస్తే ఇవి 70.1 శాతం వృద్ధి సాధించాయి. డెస్‌్కటాప్స్‌ కంటే నోట్‌బుక్స్‌కే కంపెనీలు మొగ్గుచూపడం ఇందుకు కారణం. కంపెనీలు పీసీల కోసం చేస్తున్న వ్యయాలు కొనసాగుతున్నాయి. జూన్‌తో పోలిస్తే కమర్షియల్‌ విభాగం సెప్టెంబర్‌ త్రైమాసికంలో కాస్త తగ్గాయి. లాక్‌డౌన్‌ సడలింపుల తర్వాత చిన్న, మధ్యతరహా కంపెనీలు పీసీల కొనుగోళ్లను పెంచాయి. ఈ విభాగంలో అమ్మకాలు 5.5 శాతం పెరిగాయి. పీసీ రంగంలో హైదరాబాద్‌ మార్కెట్లో 94 శాతం వరకు నోట్‌బుక్స్‌దే వాటా అని ఐటీ మాల్‌ ఎండీ మొహమ్మద్‌ అహ్మద్‌ తెలిపారు. వీటిలో రూ.30–50 వేల ధరల శ్రేణి 65 శాతం కైవసం చేసుకుందని చెప్పారు. జూన్‌తో పోలిస్తే ఈఎంఐ వాటా 20 శాతం మెరుగైందన్నారు.

మరిన్ని వార్తలు