చీటింగ్ కేసు: అమెజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్‌కు కోర్టు సమన్లు

17 Aug, 2021 19:43 IST|Sakshi

చీటింగ్ కేసుకు సంబంధించి ముంబైకి చెందిన న్యాయవాది అమృత్ పాల్ సింగ్ ఖల్సా దాఖలు చేసిన క్రిమినల్ ఫిర్యాదులో అమెజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అమిత్ అగర్వాల్ కు ఉల్హాస్ నగర్ లోని మేజిస్ట్రేట్ కోర్టు సమన్లు జారీ చేసింది. అమృత్ పాల్ సింగ్ మహారాష్ట్రలోని థానే జిల్లాలోని ఉల్హాస్ నగర్ నివాసి. 2019లో అమెజాన్ ద్వారా ఆర్డర్ చేసిన ప్రొడక్ట్ తనకు రాకపోవడంతో అతను స్థానిక కోర్టును ఆశ్రయించారు. ఈ-మెయిల్ ద్వారా విజ్ఞప్తులను చేసినప్పటికీ తను చెల్లించిన మొత్తాన్ని రిఫండ్ చేయలేదని ఆయన తన దరఖాస్తులో పేర్కొన్నారు.

ఖల్సా డిసెంబర్ 2019లో 3,999 రూపాయల విలువైన హార్డ్ డ్రైవ్ ను ఆర్డర్ చేశారు. ఈ విషయంపై ఉల్హాస్ నగర్ పోలీస్ స్టేషన్ అధికారులను సంప్రదిస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి పోలీసులు నిరాకరించినట్లు ఖల్సా పేర్కొన్నారు. ఆ తర్వాత ఫిర్యాదుపై విచారణ జరపాలని మేజిస్ట్రేట్ 2021 మార్చిలో ఉల్హాస్ నగర్ పోలీసులను ఆదేశించింది. అయితే, పోలీసులు అగర్వాల్ కు, ఖల్సా ఆర్డర్ చేసిన థర్డ్ పార్టీ విక్రేతలకు సమన్లు పంపినప్పటికీ వారు గైర్హాజరు అయ్యారు. దీంతో జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ అమెజాన్ ఇండియాకు మరోసారి సమన్లు జారీ చేసింది. సెప్టెంబర్ 22న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. అమెజాన్ ఇండియా, థర్డ్ పార్టీ విక్రేతలకు నోటీసు జారీ చేసిన కూడా అమృత్ పాల్ సింగ్ ముంబైలోని వినియోగదారుల కోర్టును ఆశ్రయించారు.

మరిన్ని వార్తలు