రూ. 225కే కోవిడ్‌ ప్రికాషన్‌ డోస్‌

10 Apr, 2022 05:19 IST|Sakshi

ప్రకటించిన సీరమ్, భారత్‌ బయోటెక్‌

న్యూఢిల్లీ: నేటి నుంచి దేశవ్యాప్తంగా మొదలయ్యే కరోనా టీకా ప్రికాషన్‌ డోస్‌ను రూ.225కే ప్రైవేట్‌ వ్యాక్సినేషన్‌ సెంటర్లకు సరఫరా చేయనున్నట్లు సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌ఐఐ), భారత్‌ బయోటెక్‌ సంస్థలు ప్రకటించాయి. ‘కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపిన తర్వాత కోవిషీల్డ్‌ టీకా ఒక్కో డోస్‌ ధరను రూ.600 నుంచి రూ.225కు తగ్గించాలని నిర్ణయించాం’అని ఎస్‌ఐఐ సీఈవో అథర్‌ పూనావాలా శనివారం ట్విట్టర్‌లో తెలిపారు.

అదేవిధంగా, ‘మా సంస్థ తయారు చేసే కోవాగ్జిన్‌ టీకా ఒక్కో డోస్‌ను ప్రైవేట్‌ ఆస్పత్రులకు రూ.1,200కు బదులుగా రూ.225కే అందజేయాలని నిర్ణయించినట్లు తెలిపేందుకు సంతోషిస్తున్నాం’అని భారత్‌ బయోటెక్‌ సహ వ్యవస్థాపకురాలు, జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సుచిత్రా ఎల్లా వెల్లడించారు. 18 ఏళ్లు నిండి, రెండో డోస్‌ తీసుకుని 9 నెలలు పూర్తయిన వారంతా 10వ తేదీ నుంచి ప్రైవేట్‌ టీకా కేంద్రాల్లో కోవిడ్‌ ప్రికాషన్‌ డోస్‌కు అర్హులని కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు