గుడ్‌ న్యూస్‌ చెప్పిన ఫుడ్ డెలివరీ సంస్థ

25 Mar, 2021 08:24 IST|Sakshi

డెలివరీ పార్టనర్లకు ఉచితం కరోనా వ్యాక్సిన్‌: స్విగ్గీ

2 లక్షలకు పైగా ఉద్యోగులకు లబ్ది

సాక్షి, ముంబై: కోవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ ప్ర‍్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో పలు కంపెనీలు తమ సిబ్బంది  అందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్‌ అందించేందుకు  ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ కూడా తమ ఉద్యోగులకు తీపి కబురు అందించింది.  సంస్థకు చెందిన  డెలివరీ పార్ట్‌నర్లు అందరికీ ఉచితంగా కరోనా టీకా  అందిస్తామని ప్రకటించింది. 

ఈ మేరకు స్విగ్జీ సీఓఓ వివేక్ సుందర్ బుధవారం అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేశారు. తమ ఉద్యోగుల కరోనా టీకా ఖర్చులను భరిస్తామని వెల్లడించారు. అలాగే ఆ టీకా స్వీకరణ నిమిత్తం సెలవు తీసుకుంటే ఆ రోజు జీతం కూడా చెల్లిస్తామని తెలిపారు. ఇందుకు ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. వీరికి టీకా కోసం తొలి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరామని వివేక్ సుందర్ పేర్కొన్నారు. టీకాలు తీసుకోవడానికి ముందు తమ డెలివరీ భాగస్వాములకు వర్క్‌షాప్‌, కౌన్సెలింగ్ సెషన్‌ల ద్వారా అవగాహన కల్పించనున్నామన్నారు. అలాగే తగిన జాగ్రత్తలను తెలియచెప్పేలా ఒక ఆరోగ్య భాగస్వామితో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపారు. స్విగ్గీ తాజా నిర్ణయంతో సుమారు 2 లక్షల డెలివరీ పార్ట్‌నర్లకు  ప్రయోజనం లభించనుంది.  

కాగా దేశవ్యాప్తంగా రెండో దశ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. 45 ఏళ్లు పైబడిన వారందరూ 2021 ఏప్రిల్ 1 నుంచి  టీకా వేయించుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు