హైదరాబాద్‌లో తగ్గిన కో-వర్కింగ్‌ స్పేస్‌ లావాదేవీలు

1 Dec, 2020 07:57 IST|Sakshi

ప్రాపర్టీ కన్సల్టెంట్‌ సావిల్స్‌ ఇండియా నివేదిక

సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్‌లో కో-వర్కింగ్‌ స్పేస్‌ లావాదేవీలు గణనీయంగా క్షీణించాయి. గతేడాది నగరంలో 21 లక్షల చ.అ.లు కో-వర్కింగ్‌ స్పేస్‌ లీజింగ్స్‌ జరగగా.. ఈ ఏడాది కేవలం 11 లక్షల చ.అ.లకు పరిమితమయ్యాయని ప్రాపర్టీ కన్సల్టెంట్‌ సావిల్స్‌ ఇండియా తెలిపింది. కార్పొరేట్‌ కంపెనీల నుంచి స్థలాల డిమాండ్‌ తక్కువగా ఉండటం, నిర్ణయాలను వాయిదా వేయటమే క్షీణతకు ప్రధాన కారణాలని పేర్కొంది. ఈ ఏడాది దేశంలోని ఆరు ప్రధాన నగరాల్లో 34 లక్షల చ.అ.లకు పడిపోయింది.

హైదరాబాద్‌తో సహా ఢిల్లీ–ఎన్‌సీఆర్, ముంబై, బెంగళూరు, చెన్నై, పుణేల్లో చూస్తే.. గతేడాది 81 లక్షల చ.అ.లు కో–వర్కింగ్‌ లీజింగ్స్‌ జరగగా.. ఇప్పుడది 58 శాతం క్షీణించి 34 లక్షల చ.అ.లకు తగ్గాయని నివేదిక తెలిపింది. 2020లో దేశంలోని మొత్తం కార్యాలయాల స్థలాల లావాదేవీల్లో కో-వర్కింగ్‌ స్పేస్‌ వాటా 11 శాతం. 

నగరాల వారీగా చూస్తే.. గతేడాది 23 లక్షల చ.అ. కో–వర్కింగ్‌ స్పేస్‌ లీజింగ్స్‌ జరిగిన బెంగళూరులో ఈ ఏడాది 11 లక్షల చ.అ.లకు తగ్గాయి. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో 15 లక్షల చ.అ.ల నుంచి ఏకంగా 2 లక్షలకు పడిపోయింది. పుణేలో 10 లక్షల చ.అ. నుంచి 4 లక్షలకు, ముంబైలో 6 లక్షల చ.అ. నుంచి 4 లక్షల చ.అ.లకు క్షీణించాయి. చెన్నైలో 6 లక్షల చ.అ. నుంచి 2 లక్షల చ.అ.లకు తగ్గాయి.

మరిన్ని వార్తలు