కరోనా లేదు, ఒమిక్రాన్‌ లేదు..2 లక్షలకు పైగా ఉద్యోగాలు రెడీగా ఉన్నాయ్‌

21 Dec, 2021 14:15 IST|Sakshi

వచ్చే ఏడాది ప్రారంభం నుంచి మనదేశానికి చెందిన పలు టెక్‌ దిగ్గజాలు భారీ సంఖ్యలో ఉద్యోగుల నియామకం చేపట్టనున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. అయితే ఈ నేపథ్యంలోప్రపంచ దేశాల్ని ఒమిక్రాన్‌ ఉక్కిరిబిక్కిరి చేయడంతో రిక్రూట్‌మెంట్‌ ఆగిపోతుందేమోనన్న అనుమానాలు తలెత్తాయి. ఆ అనుమానాలకు చెక్‌ పెడుతూ ఎకనామిక్స్‌ టైమ్స్‌ ఓ కథనాన్ని ప్రచురించింది. వచ్చే ఏడాది ఉద్యోగుల రిక్రూట్‌మెంట్‌ ఆగిపోదని ఆ కథనం సారాశం. అంతేకాదు కరోనా, ఒమిక్రాన్‌లు ఐటీ సెంటిమెంట్‌ను దెబ్బతీయలేవని రిమోట్‌ వర్క్‌ మోడల్‌ ప్రాచుర్యం పొందడమే కాదు. డిజిటల్‌, డేటా వంటి రంగాల్లో ఉద్యోగుల అవసరం పెరిగిపోనున్నట్లు కథనంలో పేర్కొంది.

  
 
2022లో టెక్‌ విభాగంలో డిమాండ్‌ పెరిగిపోతుందని, తద్వారా ఉద్యోగుల నియామకం మరింత జోరందుకోనున్నట్లు తెలుస్తోంది.ముఖ్యంగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, మైండ్‌ట్రీ తో సహా టాప్ 10 భారతీయ ఐటి కంపెనీలు మార్చిలో ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 2లక్షల మంది ఉద్యోగుల్ని ఎంపిక చేసుకోనున్నట్లు ఎకనామిక్ టైమ్స్ తెలిపింది. ఈ కంపెనీలు మొత్తం 2022 మార్చి చివరి నాటికి అట్రిషన్‌ రేటు కారణంగా దాదాపు 50లక్షల మందిని నియమించుకోనున్నాయి.  

గతేడాది దిద్దుబాటు చర్యల్లో భాగంగా ఈ ఏడాది ఐటీ రంగంలో డిమాండ్‌ దాదాపూ రెండింతలు పెరిగినట్లు ఎక్స్‌ఫెనో సహ వ్యవస్థాపకుడు కమల్ కారంత్ తెలిపారు. ముఖ్యంగా 2021 ద్వితీయార్ధంలో నెలవారీ యాక్టివ్ ఓపెనింగ్‌ ఉద్యోగాల సంఖ్య లక్షా పదివేల కంటే ఎక్కువగా ఉన్నాయని, ఇది వచ్చే ఏడాది ఆర్థిక సంవత్సరం వరకు కొనసాగుతుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

చదవండి: ఒమిక్రాన్‌ ఎఫెక్ట్‌, వర్క్‌ ఫ్రమ్‌ హోంపై దిగ్గజ కంపెనీల సంచలన నిర్ణయం..?!

>
మరిన్ని వార్తలు