Cryonics: ఇలా చేస్తే మృత శరీరం వందేళ్లయినా అలానే ఉంటుంది..

22 Jul, 2022 20:49 IST|Sakshi

Cryonics Part 6:
బ్రతికున్న మనిషి క్షణాల్లో ప్రాణాలు కోల్పోయే అతి శీతలీకరణ వాతావరణంలో మానవ అండాల్ని ఏళ్ళతరబడి నిల్వ చేస్తున్నారు. దీనివల్ల అండంలో ఎలాంటి రసాయన మార్పులు చోటు చేసుకోకపోవడం వల్ల జీవితం స్తంభించిపోతుంది. మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు అండం జీవితం మళ్ళీ మొదలవుతుంది. ఇటువంటి శీతలీకరణ వాతావరణంలో పెద్దవారి గుండె, మెదడు, ఇతర అవయవాలను నిల్వ ఉంచితే అవి స్తంభించిపోతాయి. అలా గంట సేపటి వరకు వాటిలో ఎటువంటి రసాయన మార్పులు జరగకుండా నిరోధించి తర్వాత యధాస్థితికి తీసుకురావచ్చు.

అవయవాల మార్పిడి కోసం వీటిని ఒక చోటు నుంచి మరో చోటుకు ఇటువంటి పరిస్థితుల్లో నిల్వ చేసే తీసుకువస్తారు. ప్రస్తుత కాలంలో అండంతో సహా అవయవాల్లో జీవాన్ని స్తంభింపచేసి, తిరిగి యధాస్తితికి తీసుకురావడంలో సక్సెస్ అయిన సైంటిస్టులు భవిష్యత్ లో మనిషి ప్రాణాన్ని కూడా తిరిగి తీసుకువస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. శరీరాలను ఫ్రీజ్ చేయకుండా విట్రిఫికేషన్ చేయడం ద్వారా మానవ శరీర కణజాలం శిధిలం కాకుండా కాపాడుతారు. ఫ్రీజర్ లో ఐస్ ఏర్పడుతుంది. కాని మైనస్ 120 సెంటిగ్రేడ్ కంటే తక్కువలో కూడా ఐస్ ఏర్పడకుండా కేవలం శీతలీకరించడాన్నే విట్రిఫికేషన్ గా పిలుస్తారు. ఇందులో క్రయో ప్రొటెక్టెంట్స్ గా పిలిచే అత్యంత గాఢమైన రసాయనాలను ఉపయోగిస్తారు. దీనివల్ల మృత శరీరం వందేళ్లయినా ఎలా ఉంచింది అలాగే ఉంటుంది.

పంచభూతాలతో నిర్మితమైన మృత శరీరాన్ని వందేళ్ళయినా శిధిలం కాకుండా నిల్వ చేయగలిగే పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినపుడు.. ఆ శరీరానికి తిరిగి ప్రాణం పోసే టెక్నాలజీ కూడా కచ్ఛితంగా రూపొందుతుందని ఆశిస్తున్నారు. ఒక జీవిలో సాధారణంగా జరిగే రసాయనమార్పులు క్రమం తప్పితే, ఒక పద్ధతి లేకుండా సాగితే మరణం సంభవిస్తుంది. అటువంటపుడు రసాయన మార్పులను యధాస్థితికి తీసుకురావడం సాధ్యం కాదు. అయితే క్రయోనిక్స్ విధానంలో చనిపోయిన మనిషి శరీరంలో కణజాలం ధ్వంసం కాకుండా రసాయనమార్పులను స్తంభింపచేయడం ద్వారా నిల్వ చేసి భవిష్యత్ లో తిరిగి వారికి జీవం రప్పించడమే క్రయోనిక్స్ లక్ష్యమంటున్నారు.

చదవండి: Cryonics Part 5: సర్జరీ చేసేటప్పుడు డాక్టర్లు రోగి శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తారు.. ఎందుకో తెలుసా!

మరిన్ని వార్తలు