Cryonics: మృత శరీరాన్ని నిల్వ చేసేందుకు కోటిన్నర ఖర్చు

23 Jul, 2022 19:15 IST|Sakshi

Cryonics Part 7:
సృష్టిలో కొన్ని జీవులు అతి శీతల వాతావరణంలో జీవించడానికి వీలుగా.. సహజంగానే తమ శరీరంలో రసాయన మార్పులు జరగకుండా స్తంభింపచేసి.. కొన్ని నెలలు లేదా సంవత్సరాలు జీవిస్తున్నాయి. తర్వాత జీవించడానికి అనువైన పరిస్థితులు వచ్చినపుడు వాటి శరీరంలో తిరిగి రసాయన మార్పులు  మొదలవుతాయి. కొన్ని రకాల కప్పలు, మొసళ్ళు, తొండలు వంటివి ధృవ ప్రాంతాల్లో ఇలాగే జీవిస్తాయి. వీటన్నిటినీ శాస్త్రవేత్తలు అనేక సంవత్సరాలుగా అధ్యయనం చేస్తున్నారు.

ఆ జీవుల్లో స్వతహాగా సాధ్యం అవుతున్న జీవ స్తంభన ప్రక్రియలు, తిరిగి కొనసాగే విధానాలను మనిషిలో ఎందుకు తీసుకురాలేమనే కోణం నుంచే క్రయోనిక్స్ పద్ధతి ఊపిరి పోసుకుంది. ఆల్కర్ సంస్థలో 2009 నుంచి జంతువుల మృత శరీరాలను కూడా నిల్వ చేస్తున్నారు. ఇప్పటివరకు అక్కడ 33 జంతువుల శరీరాలను విట్రిఫికేషన్ ప్రక్రియ ద్వారా కంటెయినర్లలో నిల్వ చేశారు. అమెరికా, రష్యా వంటి అగ్ర దేశాల్లో  మాత్రమే 50 ఏళ్లనుంచి క్రయోనిక్స్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటివరకు ఒక్క ఆల్కర్ సంస్థలోనే 1353 మృత శరీరాల్ని భద్రపరిచారు. రెండు అగ్రదేశాల్లో మొత్తం రెండు వేలకు పైగానే చనిపోయినవారి శరీరాలు నిల్వ చేసినట్లు తెలుస్తోంది. ఇంకా అనేక  వేల మంది తమ శరీరాలను భవిష్యత్ లో తిరిగి జీవించే ఆశతో నిల్వ చేసుకోవడానికి రిజిస్టర్ చేసుకున్నారు.

చదవండి: Cryonics Part 5: సర్జరీ చేసేటప్పుడు డాక్టర్లు రోగి శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తారు.. ఎందుకో తెలుసా!

దానికి అవసరమైన ఫీజును రెడీ చేసుకున్నారు. అయితే క్రయోనిక్స్ విధానాన్ని సమర్థించేవారిలో చాలా మంది...మరణాన్ని జయించే సాంకేతిక పరిజ్ఞానం ఎప్పటికి అందుబాటులోకి వస్తుందో కచ్చితంగా చెప్పలేమంటున్నారు. అసలు సాధ్యం అవుతుందో లేదో కూడా తెలీదంటున్నారు. విట్రిఫికేషన్ విధానంలో కంటెయినర్లలో భద్రపరిచిన శరీరాలు నిజంగా పాడవకుండా ఉన్నాయో లేదో కూడా తెలీదంటున్నారు. లండన్‌లోని కింగ్స్ కాలేజిలో న్యూరోసైన్స్ ప్రొఫెసర్‌గా ఉన్న క్లైవ్ కోయెన్ ఇలా మెదడును లేదా శరీరాన్ని భద్రపరిచే క్రయోనిక్స్ సాంకేతిక పరిజ్ఞానం విఫలమవుతుందని అభిప్రాయపడుతున్నారు.

ఒకవేళ క్రయోనిక్స్ విధానం ద్వారా చనిపోయిన మనిషికి చికిత్స చేసి జీవం పోసినా..కచ్చితంగా అనేక రుగ్మతలు వెంటాడుతాయని, మెదడు దెబ్బతింటుందని, ఆ వ్యక్తి స్పృహలోకి రాకపోవచ్చని కూడా కొందరు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. భరించలేని నొప్పి, బాధలు అనుభవించాల్సి వస్తుందని కూడా అంటున్నారు. అసలు మృత శరీరానికి తిరిగి ప్రాణం పోసే టెక్నాలజీని ఇంతవరకు శాస్త్రీయంగా రుజువు చేయలేదు. కేవలం ఊహాజనితంగానే ఆ విధానం ఉంది. వందేళ్ళ నాడు లేని టెక్నాలజీ ఇప్పుడు అందుబాటులోకి వచ్చినపుడు.. ఆనాడు లేని చికిత్సలు, ప్రాణాంతక రోగాలకు మందులు, చికిత్సలు కనిపెట్టినపుడు.. చావును ఎందుకు జయించలేమనే ఒకే ఒక ప్రశ్న నుంచి వ్యాపార అవకాశాలు పుట్టుకువచ్చాయి. ఎప్పటికీ జీవించి ఉండాలనే ఆశగల ధనికులు ఈ క్రయోనిక్స్ వ్యాపారానికి ఊపిరి పోస్తున్నారు. ఒక మృత శరీరాన్ని నిల్వ చేయడానికి ప్రస్తుత మనదేశ కరెన్సీలో  కోటిన్నర ఖర్చవుతుంది.

చదవండి: Cryonics 6: ఇలా చేస్తే మృత శరీరం వందేళ్లయినా అలానే ఉంటుంది..
 

మరిన్ని వార్తలు