భారీగా పతనమవుతున్న క్రిప్టో కరెన్సీ...!

26 May, 2021 00:27 IST|Sakshi

బిట్‌కాయిన్‌ విలువ 50% డౌన్‌ 

అదే బాటలో ఇతర కరెన్సీలు 

టెస్లా మస్క్, చైనా నియంత్రణల ప్రభావం

పెరిగిందంటే ఆకాశమే హద్దుగా చెలరేగిపోతుంది. పడిందంటే పాతాళం అంచుల దాకా పడిపోతుంది. ఇక పనైపోయిందని అంతా అనుకుంటుంటే.. మళ్లీ అంతలోనే రాకెట్‌లా ఆకాశానికి రివ్వున దూసుకెళ్లిపోతుంది. అంతే వేగంగా కుప్పకూలుతుంది. పెరిగినా, తగ్గినా ఇన్వెస్టర్లను టెన్షన్‌ పెడుతున్న క్రిప్టో కరెన్సీల తీరు ఇది. ఈ ఏడాది తొలినాళ్లలో 20,000 డాలర్ల స్థాయి నుంచి ఏప్రిల్‌ నాటికి 60,000 డాలర్లకు ఎగిసిన బిట్‌కాయిన్‌ మళ్లీ నెల తిరగకుండానే 30,000 డాలర్లకు కూడా పతనం కావడం ఇందుకు నిదర్శనం. నియంత్రణ సంస్థలు, సంప్రదాయ చెల్లింపు మార్గాలతో సంబంధం లేకుండా డిజిటల్‌ రూపంలో నగదును బదలాయించేందుకు ఉపయోగిస్తున్న క్రిప్టోకరెన్సీల పతనంపై ఈ ప్రత్యేక కథనం... 

మే 19.. క్రిప్టో కరెన్సీ ఇన్వెస్టర్లకు చుక్కలు చూపించింది. పలు క్రిప్టో కరెన్సీల విలువ 12 శాతం నుంచి ఏకంగా 40% దాకా పడిపోయింది. మిగతా వాటితో పోలిస్తే భారీగా ట్రేడయ్యే బిట్‌కాయిన్‌ విలువ చివరికి కాస్త కోలుకున్నప్పటికీ ఒక దశలో 30% దాకా పతనమైంది. వెరసి క్రిప్టోకరెన్సీల విలువ ఒక్క రోజులో ఏకంగా లక్ష కోట్ల డాలర్లు ఆవిరైంది. వర్చువల్‌ కరెన్సీలకు సంబంధించి ఇన్వెస్టర్లలో అత్యంత ప్రాచుర్యం పొందిన కరెన్సీల్లో బిట్‌కాయిన్‌ అగ్రస్థానంలో ఉంటోంది. కానీ ఈ కరెన్సీ తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతుండటం.. ఇన్వెస్టర్లను కలవరపర్చే అంశం. తాజా పతనం వెనుక టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్‌ మస్క్, చైనా నియంత్రణలు కారణంగా నిల్చాయి.   

మస్క్‌ ట్వీట్లు .. చైనా ఆంక్షలు.. 
ఒక్క చిన్న ట్వీట్‌తో బిట్‌కాయిన్‌ను పైకి పరుగులు తీయించిన ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ దిగ్గజం టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్‌ మస్క్‌ .. అలాంటిదే మరో ట్వీట్‌తో కిందికి కూలదోశారు. బిట్‌కాయిన్లతో తమ కార్లను కూడా కొనుగోలు చేయొచ్చంటూ కొన్నాళ్ల క్రితం ఆయన ట్వీట్‌ చేసినప్పుడు దాని విలువ ఎకాయెకిన 32,000 డాలర్ల నుంచి 38,000 డాలర్లకు ఎగిసింది. ఆ తర్వాత అదే ఊపు కొనసాగిస్తూ 65,000 డాలర్ల దాకా పెరిగింది. అయితే, పర్యావరణ కారణాల రీత్యా బిట్‌కాయిన్ల ద్వారా లావాదేవీలు జరపబోమంటూ మే 13న మస్క్‌ మరో ట్వీట్‌ చేశారు. ఆ తర్వాత ఆయన తనదగ్గరున్న దాదాపు 1.5 బిలియన్‌ డాలర్ల బిట్‌కాయిన్లను అమ్మేయనున్నారంటూ మే 19న వార్తలు రావడం, దాన్ని దాదాపు ధృవీకరించేలా ఆయన ట్వీట్‌ చేయడం.. బిట్‌కాయిన్‌ను దెబ్బతీసింది.

ఆ రోజునే బిట్‌కాయిన్‌ భారీగా పతనమైంది. అయితే, తన దగ్గరున్న బిట్‌కాయిన్‌ను విక్రయించే యోచనేదీ లేదంటూ వివరణనివ్వడంతో మళ్లీ కాస్తంత కోలుకుంది. ఇక, క్రిప్టో కరెన్సీల పతనంలో చైనా పాత్ర కూడా కొంత ఉందని మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. చైనా 2017లోనే తమ దేశంలో క్రిప్టో ఎక్సే్చంజీలను మూసివేసినప్పటికీ.. ప్రజలు మాత్రం అనధికారికంగా ట్రేడింగ్‌ చేస్తూనే ఉన్నారు. ఇటీవలే సొంతంగా డిజిటల్‌ కరెన్సీని ప్రయోగాత్మకంగా వినియోగించడం మొదలుపెట్టిన చైనా..  మే 18న క్రిప్టోకరెన్సీ లావాదేవీలకు సంబంధించి సర్వీసులు అందించకుండా ఆర్థిక సంస్థలు, పేమెంట్‌ కంపెనీలను నిషేధించింది. అలాగే స్పెక్యులేటివ్‌ క్రిప్టో ట్రేడింగ్‌ చేయరాదంటూ ఇన్వెస్టర్లను కూడా హెచ్చరించింది. ఇది కూడా క్రిప్టో కరెన్సీల పతనానికి దారి తీసింది. 

లాభాల స్వీకరణ..: ఇన్వెస్టర్లు కంగారుపడి అమ్మేసుకోవడం కూడా ప్రస్తుత పతనానికి కారణం. గతేడాది క్రిప్టోలను కొనుగోలు చేసిన వారు కొంత లాభాల స్వీకరణకు మొగ్గు చూపినట్లు పరిశ్రమవర్గాలు తెలిపాయి. టెక్నికల్‌గా చూస్తే సాధారణంగా కరెక్షన్లు వచ్చినప్పుడు సుమారు 50% దాకా విలువ పడిపోతుంది. దాన్ని బట్టి చూస్తే బిట్‌కాయిన్‌ కనిష్ట స్థాయిని తాకి ఉండొచ్చన్నది భావిస్తున్నారు.

  • కాయిన్‌గెకోడాట్‌కామ్‌ లెక్కల ప్రకారం మే 13–20 మధ్య క్రిప్టో కరెన్సీల మార్కెట్‌ క్యాప్‌ ఏకంగా 50 శాతం తుడిచిపెట్టుకుపోయింది.
  • గత వారం రోజుల వ్యవధిలో ఎథీరియం 25 శాతం, బైనాన్స్‌ విలువ 33% పడిపోయింది. 
  • మస్క్‌ బాధ్యతారహితమైన ట్వీట్లతో చిరాకెత్తిన కొందరు ట్రేడర్లు స్టాప్‌ఎలాన్‌ పేరుతో కొత్త క్రిప్టో కరెన్సీని తెరపైకి తెచ్చారు. దీని విలువ కేవలం 24 గంటల్లో 4,874 శాతం ఎగియడం గమనార్హం. 0.0000019 డాలర్ల నుంచి 0.00009450 డాలర్లకు పెరిగింది.  


ఆమోదయోగ్యత అంతంతే.. 
పేరుకి కరెన్సీ అయినప్పటికీ క్రిప్టోలను వ్యాపార లావాదేవీల్లో ఉపయోగిస్తున్నది మాత్రం తక్కువే. ప్రపంచవ్యాప్తంగా సుమారు 15,000 వ్యాపార సంస్థలే క్రిప్టో కరెన్సీల్లో లావాదేవీలకు అనుమతిస్తున్నాయి. ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ దిగ్గజం టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ కొద్ది రోజుల క్రితం తాము కూడా క్రిప్టో కరెన్సీల ద్వారా చెల్లింపులు తీసుకుంటామంటూ ఘనంగా ప్రకటించినప్పటికీ.. అంతలోనే మనసు మార్చుకున్నారు. 

అయిదేళ్లలో 500 డాలర్ల నుంచి 65వేల డాలర్లకు.. 
గడిచిన 5 ఏళ్లలో చూస్తే 2016లో 500 డాలర్లుగా ఉన్న బిట్‌కాయిన్‌ విలువ ఆ మరుసటి ఏడాది 2017లో 19,000 డాలర్లకు ఎగిసింది. ఆ మరుసటి ఏడాది 2018లో 3,000 డాలర్లకు పతనమైంది. 2019లో నెమ్మదిగా 7,000 డాలర్లకు, 2020 ఆఖరు నాటికి 20,000 డాలర్లకు చేరింది. ఇక ఈ ఏడాదైతే ఆకాశమే హద్దుగా పెరిగిపోయింది. అలాగే పడిపోయింది కూడా. ఉదాహరణకు ఈ ఏడాది తొలినాళ్లలో 20,000 డాలర్లుగా ఉన్న బిట్‌కాయిన్‌ విలువ ఏప్రిల్‌ మధ్య నాటికి దాదాపు 65,000 డాలర్లకు ఎగిసింది. ఇప్పుడు 40,000 డాలర్ల దగ్గరికి పడిపోయింది. 


కరెక్షన్స్‌ సాధారణమే .. 
భారీ ర్యాలీ తర్వాత క్రిప్టో సహా చాలా మటుకు మార్కెట్లలో పెద్ద యెత్తున కరెక్షన్స్‌ జరగడం సాధారణమేనని క్రిప్టో ఎక్సే్చంజీ జెబ్‌పే సీఈవో రాహుల్‌ పగిడిపాటి సాక్షి బిజినెస్‌ బ్యూరోకు తెలిపారు. దేశీయంగా క్రిప్టోపై భారతీయుల్లో ఆసక్తి పెరుగుతోందని, దీనికి అనుగుణంగానే ఎక్సే్చంజీలు తమ సర్వర్లు, ఇన్‌ఫ్రాను అప్‌గ్రేడ్‌ చేసుకుంటున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయని తెలిపారు. నియంత్రణ సంస్థలపరంగా స్పష్టత లేకపోవడం మరో సవాలని వివరించారు.

క్రిప్టో వంటి సాధనాల గురించి అవగాహన పెంచుకున్న తర్వాతే దీర్ఘకాలిక ప్రణాళికతో కొద్దికొద్దిగా ఇన్వెస్ట్‌ చేయడం శ్రేయస్కరమని దేశీ ఇన్వెస్టర్లకు రాహుల్‌ సూచించారు. ప్రస్తుతం 40 లక్షల మంది తమ ప్లాట్‌ఫాం ద్వారా క్రిప్టోల్లో ఇన్వెస్ట్‌ చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, ఇటీవల క్రిప్టో కరెన్సీని స్వీకరించే విషయంలో టెస్లా యూటర్న్‌ తీసుకోవడం ఇన్వెస్టర్ల మైండ్‌సెట్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిందని దేశీ బిట్‌కాయిన్‌ ఎక్సే్చంజీ బైటెక్స్‌ వ్యవస్థాపక సీఈవో మోనార్క్‌ మోదీ తెలిపారు 

మరిన్ని వార్తలు