ఆ కంపెనీలో మహిళలతో సమానంగా పురుషులకు ప్రసూతి సెలవులు

15 Jul, 2021 17:50 IST|Sakshi

ప్రముఖ గ్లోబల్ ఇంజనీరింగ్, టెక్నాలజీ సొల్యూషన్స్ కంపెనీ సైయెంట్‌ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్యాలయాల్లో మహిళలతో సమానంగా పురుషులకు 12 వారాల పాటు ప్రసూతి సెలవులు ఇస్తున్నట్లు కొత్త విధానాన్ని బుధవారం ప్రకటించింది. ఈ కొత్త విధానం కింద సైయెంట్ ఉద్యోగులు లింగ భేదంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి 12 వారాల పాటు ప్రసూతి సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ సెలవుల సమయంలో ఉద్యోగులు పూర్తి వేతనాన్ని అందుకొనున్నారు. దత్తత తీసుకున్న తల్లిదండ్రులకు కూడా ఈ నిబంధన వర్తిస్తుంది అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పాలసీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైయెంట్ ఉద్యోగులందరికీ వర్తిస్తుంది. 

"సైయెంట్ సంస్థను పని చేయడానికి గొప్ప ప్రదేశంగా మార్చడానికి మేము ఎల్లప్పుడూ ప్రయత్నిస్తున్నాము. తల్లిదండ్రులు తమ కుటుంబాలతో ఎక్కువ సమయాన్ని గడపడానికి ఈ విధానం సహాయపడుతుంది" అని సైయెంట్ ప్రెసిడెంట్, చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ పీఎన్‌ఎస్‌వీ నరసింహం తెలిపారు. "తల్లిదండ్రులైన వారికి కొన్ని దేశాల్లో ఇస్తున్న సెలవులు సరిపోవడం లేదని తమ దృష్టికి తీసుకొనిరావడంతో ఈ కొత్త విధానాన్ని ప్రకటించినట్లు, పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు ఇద్దరు సమాన బాధ్యతలు పంచుకునేందుకు కొత్త విధానం తోడ్పడుతుందని" సైయెంట్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ కృష్ణ బోడనాపు తెలిపారు.
 

మరిన్ని వార్తలు