ఝలక్‌ ఇచ్చిన ఐటీ షేర్లు.. నష్టాలతో మొదలైన మార్కెట్‌

6 Jun, 2022 09:55 IST|Sakshi

ముంబై: ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, మెటల్‌ షేర్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొనడంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు ఈ వారం నష్టాలతో ఆరంభమయ్యాయి. లార్జ్‌, మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ షేర్లు కూడా నష్టాల్లో కొనసాగుతున్నాయి. రుతుపవనాలు సకాలంలో వస్తాయి సమృద్ధిగా వర్షాలు పడతాయనే సానుకూల వార్తలు ఉన్నా మరోసారి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రెపోరేటు పెంచవచ్చనే అంచనాలు మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. దీంతో అమ్మకాల ఒత్తిడి నెలకొంది.

ఈ రోజు ఉదయం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 55,610 పాయింట్ల దగ్గర మొదలైంది. ఆ తర్వాత వరుసగా పాయింట్లు కోల్పోతూ వచ్చింది. ఉదయం 9:50 గంటల సమయంలో 393 పాయింట్లు నష్టపోయి 55,375 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. మరోవైపు నిఫ్టీ 261 పాయింట్లు నష్టపోయి 16,475 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది.

ఈ రోజు ఉదయం సెషన్‌లో స్టాక్‌ మార్కెట్‌లో ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, హిందూస్థాన్‌ యూనిలీవర్‌, ఐటీసీ, టెక్‌ మహీంద్రా షేర్లు భారీ నష్టాలను చవి చూశాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, యాక్సిస్‌ బ్యాంకు షేర్లకు నష్టాలు తప్పలేదు. నిఫ్టీ బ్యాంక్‌, నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ హెల్త్‌కేర్‌ సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. 

మరిన్ని వార్తలు