బేర్‌ పంజా.. ఆరంభంలోనే భారీ పతనం.. లక్షల కోట్ల సంపద ఆవిరి

12 May, 2022 09:30 IST|Sakshi

ముంబై: మార్కెట్‌లో బేర్‌ పంజా కొనసాగుతోంది. చాలా కంపెనీల నాలుగో ‍ త్రైమాసికం ఫలితాలు ఆశాజనకంగా లేకపోవడం, అదుపు తప్పుతున్న ద్రవ్యోల్బణం, యుద్ధ భయాల నడుమ స్టాక్‌ మార్కెట్‌పై బేర్‌ పట్టు సాధించింది. దీంతో వరుసగా మార్కెట్‌ నష్టాల పాలు అవుతోంది. విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులు వెనక్కి తీసుకుంటున్నారు. దేశీ ఇన్వెస్టర్లు జాగ్రత్త పడుతున్నారు. మరోవైపు ఏ వైపు నుంచి మార్కెట్‌కు జోష్‌ అందించే పరిణామాలు చోటు చేసుకోవడం లేదు. 

ఈ రోజు ఉదయం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 53,608 పాయింట్ల వద్ద నష్టాలతో ప్రారంభమైంది. కానీ ఆ వెంటనే అమ్మకాల ఒత్తిడి నెలకొనడంతో వేగంగా పాయింట్లు కోల్పోయింది. ఉదయం 9:20 గంటల సమయంలో బీఎఉస్‌ఈ సెనెక్స్‌ 782 పాయిం‍ట్ల నష్టంతో 1.45 క్షీణత నమోదు చేసి 53,305 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు నిఫ్టీ 239 పాయింట్లు నష్టపోయి 1.48 శాతం క్షీణత నమోదు చేసి 15,927 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. 

క్రితం రోజు కనాకష్టంగా 54 వేలు, 16 వేల పాయింట్ల మార్క్‌ను కాపాడుకున్న స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం రోజు ఆరంభంలోనే వాటిని కోల్పోయాయి. సాయంత్రం వరకు ఇదే ట్రెండ్‌ కొనసాగి కొనుగోళ్ల మద్దతు లభించకపోతే భారీ నష్టాలు తప్పేలా లేవు. లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోనుంది. 

మరిన్ని వార్తలు