ముంబై: స్టాక్మార్కెట్లో కరెక్షన్ మొదలైందా ? అంటే అవునంటున్నారు మార్కెట్ పండితులు,. గత కొన్ని సెషన్లుగా ఊహకందరి రీతిలో వరుసగా పాయింట్లు లాభపడుతూ పోయిన దేశీ సూచీలు ఇప్పుడు నేల ముఖం చూస్తున్నాయి. వరుసగా మూడో రోజు స్టాక్ మార్కెట్ నష్టాలతోనే ముగిసింది.
బీఎస్ఈ సెన్సెక్స్ ఈ రోజు ఉదయం ఆశాపూరిత వాతావరణంలో ప్రారంభమైంది. ఉదయం 61,558 పాయింట్లతో ప్రారంభమై ఆ తర్వాత లాభాల బాట పట్టింది. దీంతో ఈ రోజు మార్కెట్లో బుల్ జోరు కొనసాగుతుందనే నమ్మకం ఏర్పడింది. కానీ అరగంట తర్వాత పరిస్థితి తారుమారైంది. అక్కడి నుంచి సెన్సెక్స్ వరుసగా పాయింట్లు కోల్పోతూ ఒక దశలో 60,485 పాయింట్లకు చేరుకుంది. ఇంచుమించు 900 పాయింట్లు నష్టపోయింది. కానీ మార్కెట్ ముగిసే సమయంలో కోలకుంది. ఐనప్పటికీ 336 పాయింట్ల నష్టంతో 60,923 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీకి 89 పాయింట్లు నష్టపోయి 18,178 పాయింట్ల దగ్గర ముగిసింది.
మార్కెట్ను ముందుకు తీసుకెళ్లడంలో ఎప్పుడూ ముందుండే ఐటీ, మెటల్, రియల్టీ స్టాక్స్ ఈరోజు నష్టాలను చవి చూశాయి. బీఎస్సీలో టాటాస్టీల్, డాక్టర్ రెడ్డీస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, భారతీ ఎయిర్టెల్, ఇన్ఫోసిస్ షేర్లు నష్టపోయాయి. నిఫ్టీలో ఐటీ, మెటల్, రియల్టీ షేర్లు నష్టాలను చవి చూశాయి.