చివర్లో తేరుకున్న మార్కెట్‌.. ఐనా తప్పని భారీ నష్టాలు

27 Jan, 2022 16:15 IST|Sakshi

ముంబై :  అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ బ్యాంకు వడ్డీ రేట్ల పెంపు అంశంతో ఈ రోజు ఉదయం కుదేలైన మార్కెట్లు సాయంత్రానికి కొంత కోలుకున్నాయి. ఉదయం మార్కెట్‌ ప్రారంభం కావడంతోనే బాంబే స్టాక్‌ ఎక్సేంజీ, నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజీ సూచీలు భారీగా నష్టపోయాయి. కేవలం గంట వ్యవధిలోనే బీఎస్‌సీ సెన్సెక్స్‌ 1500ల పాయింట్లు, నిఫ్టీ 5 వందల పాయింట్లు నష్టపోయి ఇన్వెస్టర్ల గుండెళ్లో రైళ్లు పరుగెత్తించాయి. ఒక్క గంట వ్యవధిలోనే నాలులు లక్షల కోట్ల రూపాయల మార్కెట్‌ సంపద ఆవిరైపోయింది. దీంతో సాయంత్రం మార్కెట్‌ ఎలా ముగుస్తుందనే ఉత్కంఠ నెలకొంది.

షేర్ల ధర భారీగా పతనం కావడంతో మధ్యాహ్నం 12:30 గంటల నుంచి కొనుగోలుదారుల మద్దతు లభించింది. దీంతో క్రమంగా మార్కెట్‌ పుంజుకోవడం మొదలైంది. మొత్తాన్ని మార్కెట్‌ ముగిసే సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 581 పాయింట్లు నష్టపోయి 57,276 పాయింట్ల దగ్గర క్లోజవగా నిఫ్టీ 168 పాయింట్ల నష్టంతో 17110 వద్ద  ముగిసింది. ఒక దశలో నిఫ్టీ 16,866, సెన్సెక్స్‌ 56,436 పాయింట్ల కనిష్టానికి పడిపోయి పట్టపగలే ఇన్వెస్టర్లకు చుక్కలు చూపించాయి. మార్కెట్‌ ముగిసే సరికి నష్టాలు తగ్గిపోవడంతో ఇన్వెస్టర్లకు ఉపశమనం లభించింది.

ఈ రోజు హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ షేర్లు భారీగా పతనం అయ్యాయి. హెచ్‌సీఎల్‌ షేర్లు 4 శాతం క్షీణించాయి. టెక్‌మహీంద్రా, డాక్టర్‌ రెడ్డీస్‌ లాబరేటరీస్‌, విప్రో, టీసీఎస్‌, టైటాన్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు భారీగా నష్టపోయాయి. యాక్సిస్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, మారుతి సుజూకి, కోటక్‌ మహీంద్రా, ఇండస్‌ఇండ్‌, ఐటీసీ షేర్లు లాభాలు పొందాయి. 
 

మరిన్ని వార్తలు