Stock Market: భారీ లాభాలు మాయం

5 May, 2022 16:41 IST|Sakshi

ముంబై: మూడు రోజుల వరుస నష్టాల తర్వాత ఈ రోజు స్టాక్‌ మార్కెట్‌లో జోష్‌ కనిపించింది. అయితే ఆ ఉత్సాహాం కొద్ది సేపే ఉంది. మధ్యాహ్నం తర్వాత అమ్మకాల ఒత్తిడి పెరగడంతో ఆరంభ లాభాలు ఆవిరయ్యాయి. ఈ రోజు మార్కెట్‌ ఆరంభంలో షేర్ల ధరలు తక్కువగా ఉండటంతో కొనుగోళ్ల మద్దతు లభించింది. దీంతో సెన్సెక్స్‌ ఐదు వందలు, నిఫ్టీ 180 పాయింట్లకు పైగా నష్టాలతో మొదలయ్యాయి. అయితే అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో మధ్యాహ్నం నుంచి లాభాల స్వీకరణకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపారు. ఫలితంగా అమ్మకాల ఒత్తిడి నెలకొలంది. దీంతో ఆరంభంలో కనిపించిన భారీ లాభం కరిగిపోయింది.

ఈ రోజు ఉదయం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 56,255 పాయింట్లతో మొదలైంది. ఆ తర్వాత వరుసగా లాభాలు పొందుతూ ఓ దశలో 56,566 పాయింట్ల గరిష్టాలను టచ్‌ చేసింది. అయితే ఆ తర్వాత క్రమంగా పాయింట్లు కోల్పోతూ వచ్చింది. చివరకు 33 పాయింట్ల లాభంతో 55,702 పాయింట్ల దగ్గర క్లోజయ్యింది. మరోవైపు నిఫ్టీ కేవలం ఐదు పాయింట్లే లాభపడి 16,682 పాయింట్ల దగ్గర ముగిసింది. బ్యాంకింగ్‌, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ కంపెనీల షేర్ల ధరలు కుంగిపోవడంతో భారీ లాభాలకు గండిపడింది.

మరిన్ని వార్తలు