కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు శుభవార్త..!

30 Mar, 2022 15:30 IST|Sakshi

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్రం శుభవార్తను అందించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అదనపు విడత డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) , పెన్షనర్లకు డియర్‌నెస్ రిలీఫ్ (డీఆర్) విడుదల చేయడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

డియర్‌నెస్‌ అలవెన్స్‌ (డీఏ)ను  3 శాతం పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో డియర్‌నెస్‌ అలవెన్స్‌ 34 శాతంకు చేరనుంది. గతంలో ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు 31 శాతం మేర డీఏను పెంచాలని కేంద్రం నిర్ణయించగా..ఇప్పుడు అనూహ్యంగా డీఏను 34 శాతంగా పెంచింది. 7వ వేతన సంఘం సిఫార్సులు ఆధారంగా డీఏ  అమలు జనవరి 1, 2022 అమల్లోకి రానుంది.  ధరల పెరుగుదల నేపథ్యంలో బేసిక్‌ పే/పెన్షన్‌కు అదనంగా 3 శాతం డీఏ పెంపును  వేతన సంఘం సిఫార్సు చేసింది.

డీఏ పెంపు నిర్ణయం 47.68 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68.62 లక్షల మంది పెన్షనర్లకు లబ్ది చేకూరనుంది. ఇది సివిల్ ఉద్యోగులు,  రక్షణ సేవల్లో పనిచేస్తున్న వారికి వర్తిస్తుంది.  ఇక 3 శాతం డీఏ పెంపుతో కేంద్ర ఖజానాపై ఏటా రూ.9,544.50 కోట్ల మేర అదనపు భారం పడనున్నుట్లు సమాచారం.  కోవిడ్‌-19 కారణంగా 2020లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్‌ అలవెన్స్‌ను కేంద్రం నిలిపివేసింది. కాగా 2021 జూలైలో డీఏను 17 శాతం నుంచి 28 శాతానికి పెంచింది.  తరువాత మరో 3 శాతం పెంచి 31 శాతం డీఏను ఫిక్స్‌ చేసింది. 

చదవండి: టాక్స్‌ పేయర్లకు అలర్ట్‌..! ఏప్రిల్‌ 1 నుంచి కొత్త రూల్స్‌..!

మరిన్ని వార్తలు