వైర్లెస్ టెక్నాలజీలపై దేశీ సంస్థల భారీ పెట్టుబడులు
డెలాయిట్ సర్వేలో కీలక విషయాలు వెల్లడి
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి విజృంభణతో దేశీ కంపెనీలు అధునాతన వైర్లెస్ టెక్నాలజీలపై గణనీయంగా ఇన్వెస్ట్ చేయాలని భావిస్తున్నాయి. ఈ తరహా పెట్టుబడుల ప్రణాళికలకు సంబంధించి జపాన్ తర్వాత భారత్ రెండో స్థానంలో ఉంది. కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్ నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 71 శాతం భారతీయ ఎగ్జిక్యూటివ్లు.. మహమ్మారి కారణంగా వైర్లెస్ నెట్వర్కింగ్పై తమ తమ కంపెనీలు మరింతగా ఇన్వెస్ట్ చేస్తాయని విశ్వసిస్తున్నారు. 5జీ టెక్నాలజీ గానీ పూర్తిగా అందుబాటులోకి వస్తే ఆఫీసుల్లో కమ్యూనికేషన్, మెషీన్లను రిమోట్గా పర్యవేక్షించడం, కస్టమర్లకు మరింత మెరుగైన సర్వీసులు అందించడం మొదలైనవి మరింత సులభతరం కాగలవని ఎగ్జిక్యూటివ్లు భావిస్తున్నారు. 5జీ,వైఫై-6 వంటి కొత్త తరం వైర్లెస్ టెక్నాలజీలతో భద్రత, విశ్వసనీయత మొదలైన అంశాలకు సంబంధించి సర్వీసుల ప్రమాణాలు మెరుగుపడగలవని, వ్యాపార సంస్థలను విజయపథంలో నడపగలవని సర్వే తెలిపింది.