పన్ను వసూళ్లు పెరగడానికి డీమానిటైజేషన్‌ కారణం

24 Oct, 2022 06:38 IST|Sakshi

ఆర్‌బీఐ ఎంపీసీ సభ్యురాలు ఆషిమా గోయల్‌

న్యూఢిల్లీ: పన్ను వసూళ్లు పెరిగేందుకు పెద్ద నోట్ల రద్దు (డీమానిటైజేషన్‌) కూడా తోడ్పడిందని రిజర్వ్‌ బ్యాంక్‌ ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సభ్యురాలు ఆషిమా గోయల్‌ తెలిపారు. అంతిమంగా ..  పెద్ద సంఖ్యలో ట్యాక్స్‌పేయర్లపై తక్కువ స్థాయిలో పన్నులు విధించగలిగే ఆదర్శవంతమైన విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు ఇది దోహదపడగలదని ఆమె పేర్కొన్నారు.

నల్ల ధనం చలామణీని అరికట్టేందుకు, డిజిటల్‌ పేమెంట్లను ప్రోత్సహించేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా 2016 నవంబర్‌ 8న రూ. 500, రూ. 1,000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ అసాధారణ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్లు, వ్యక్తిగత ఆదాయాలపై పన్నుల స్థూల వసూళ్లు 24 శాతం పెరిగి రూ. 8.98 లక్షల కోట్లకు చేరినట్లు ఆదాయ పన్ను విభాగం అక్టోబర్‌ 9న వెల్లడించింది. వస్తు, సేవల పన్నుల (జీఎస్‌టీ) వసూళ్లు వరుసగా ఏడో నెలా రూ. 1.40 లక్షల కోట్ల పైగానే నమోదయ్యాయి. సెప్టెంబర్‌లో 26 శాతం పెరిగి (గతేడాది సెప్టెంబర్‌తో పోలిస్తే) రూ. 1.47 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 

మరిన్ని వార్తలు