Amazon: అమెజాన్‌ ద్వారా దేశంలో ఇంత మంది ఉపాధి పొందుతున్నారా?!

16 May, 2022 14:43 IST|Sakshi

5 బిలియన్‌ డాలర్ల ఎగుమతులకు తోడ్పాటు

11.6 లక్షల ఉద్యోగాల కల్పన 

అమెజాన్‌ ఇండియా వెల్లడి  

న్యూఢిల్లీ: భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత నుంచి ఇప్పటి వరకూ దాదాపు 5 బిలియన్‌ డాలర్ల ఎగుమతులకు తోడ్పాటు అందించినట్లు ఈ–కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ ఇండియా వెల్లడించింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా 11.6 లక్షల పైగా ఉద్యోగాల కల్పనకు ఊతమిచ్చినట్లు వివరించింది. ఇప్పటి దాకా 40 లక్షల లఘు, చిన్న, మధ్య తరహా సంస్థలను (ఎంఎస్‌ఎంఈ) డిజిటైజ్‌ చేసినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 

చిన్న సంస్థల డిజిటైజేషన్‌కూ తోడ్పాటు అందించేందుకు ఉద్దేశించి 2020 జనవరిలో నిర్వహించిన తొలి అమెజాన్‌ సంభవ్‌ కార్యక్రమంలో 2025 నాటికి 1 కోటి పైగా ఎంఎస్‌ఎంఈలను డిజిటలీకరించాలని, 10 బిలియన్‌ డాలర్ల ఎగుమతులు, 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొంది. 2021లో టెక్నాలజీ ఆవిష్కరణలపై పనిచేసే ఎంట్రప్రెన్యూర్లు, స్టార్టప్‌లలో ఇన్వెస్ట్‌ చేసేందుకు వెంచర్‌ ఫండ్‌ ఏర్పాటు చేసినట్లు వివరించింది. ఇది ఇప్పటికే ’మైగ్లామ్‌’, ’ఎం1ఎక్సేంజ్‌’, ’స్మాల్‌ కేస్‌’ వంటి సంస్థల్లో ఇన్వెస్ట్‌ చేసినట్లు పేర్కొంది. ఎంఎస్‌ఎంఈల డిజిటలీకరణ, ఎగుమతులకు ఊతమిచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాల ద్వారా వేల సంఖ్యలో ఉపాధి అవకాశాల కల్పనకు సహాయం అందించగలుగుతున్నామని అమెజాన్‌ ఇండియా కంట్రీ మేనేజర్‌ (భారత్‌లో వినియోగదారుల వ్యాపార విభాగం) మనీష్‌ తివారి తెలిపారు.  

చదవండి: ఏపీజే ఎడ్యుకేషన్‌తో ఏడబ్ల్యూఎస్‌ జట్టు

మరిన్ని వార్తలు