ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్, మైండ్‌ట్రీ విలీనం

7 May, 2022 10:30 IST|Sakshi

ఎల్‌టీఐమైండ్‌ట్రీగా ఏర్పాటు 

దేశీయంగా ఆరో పెద్ద ఐటీ కంపెనీ 

ముంబై: డిజిటల్‌ సర్వీసుల్లో భారీ ఆర్డర్ల కోసం పోటీపడే దిశగా ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌ (ఎల్‌టీఐ), మైండ్‌ట్రీలను విలీనం చేస్తున్నట్లు ఇంజనీరింగ్, నిర్మాణ రంగాల దిగ్గజం ఎల్‌అండ్‌టీ గ్రూప్‌ వెల్లడించింది. విలీన సంస్థ పేరు ఎల్‌టీఐమైండ్‌ట్రీగా ఉంటుందని  వివరించింది. 3.5 బిలియన్‌ డాలర్ల ఆదాయంతో టెక్‌ మహీంద్రా తర్వాత రెవెన్యూపరంగా దేశీయంగా ఆరో అతి పెద్ద ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ సంస్థగా ఎల్‌టీఐ ఉండనుంది. అవసరమైన అనుమతులన్నీ వచ్చాక వచ్చే పదకొండు నెలల్లో ప్రక్రియ పూర్తి కాగలదని ఎల్‌అండ్‌టీ గ్రూప్‌ పేర్కొంది. విలీన సంస్థకు దేబాశీష్‌ చటర్జీ సారథ్యం వహిస్తారు. ఎల్‌టీఐ సీఈవో సంజయ్‌ జలోనా వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేసినట్లు ఎల్‌అండ్‌టీ చైర్మన్‌ ఏఎం నాయక్‌ చెప్పారు. 2 కంపెనీల్లో ఎల్‌అండ్‌టీకి మెజారిటీ వాటాలు ఉన్నా యి. పూర్తిగా స్టాక్స్‌ రూపంలో ఉండే ఈ డీల్‌ ప్రకా రం మైండ్‌ట్రీ షేర్‌హోల్డర్ల దగ్గరున్న ప్రతి 100 షేర్ల కు 73 ఎల్‌టీఐ షేర్లు లభిస్తాయి. ఎల్‌టీఐమైండ్‌ట్రీలో ఎల్‌అండ్‌టీకి 68.73% వాటాలు ఉంటాయి.  

టార్గెట్‌ 10 బిలియన్‌ డాలర్లు 
100 మిలియన్‌ డాలర్లకు పైగా విలువ చేసే భారీ డీల్స్‌ కోసం పోటీపడేందుకు ఈ విలీనం ఉపయోగపడగలదని నాయక్‌ తెలిపారు. ప్రస్తుతం ఈ కంపెనీలకు లభిస్తున్న ప్రాజెక్టుల విలువ దాదాపు 25 మిలియన్‌ డాలర్ల స్థాయిలోనే ఉంటోందని ఆయన చెప్పారు. ఆదాయ పరిమాణం తక్కువగా ఉండటం వల్ల పెద్ద కాంట్రాక్టులకు బిడ్‌ చేయడం సాధ్యపడటం లేదని నాయక్‌ తెలిపారు. వచ్చే అయిదేళ్లలో విలీన సంస్థ ఆదాయాలు 10 బిలియన్‌ డాలర్లకు చేరుకోగలదన్న ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇది 3.5 బిలియన్‌ డాలర్లుగా ఉంది.  

80వేల పైచిలుకు సిబ్బంది
విలీన సంస్థలో 80,000 మంది పైగా సిబ్బంది ఉంటారు. విలీనంతో తాము కొత్తగా 15–20% మందిని కొత్తగా రిక్రూట్‌ చేసుకోవాల్సి రానున్నట్లు నాయక్‌ తెలిపారు. ఎల్‌అండ్‌టీలో ఐటీ విభాగంగా 2000లో ఎల్‌టీఐ ఏర్పాటైంది. 2019లో మైండ్‌ట్రీలో ఎల్‌అండ్‌టీ గ్రూప్‌ మెజారిటీ వాటాలు కొనుగోలు చేసింది. 

చదవండి:  ఫ్రెషర్లకు అదిరిపోయే శుభవార్త..! కాగ్నిజెంట్‌లో భారీగా నియామకాలు!

మరిన్ని వార్తలు