సీనియర్ సిటిజన్స్ కోసం అదిరిపోయే స్కీమ్, రిస్క్ లేకుండా అధిక వడ్డీతో..

14 Jan, 2022 20:31 IST|Sakshi

సీనియర్‌ సిటిజన్స్‌ కోసం తక్కువ రిస్క్‌, అధికరాబడిని అందించే రకరకాల స్కీమ్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిలో పోస్టాఫీస్‌ అందించే ఈ స్కీమ్‌ ప్రత్యేకం. ఎందుకంటే మిగిలిన స్కీమ్స్‌తో పోలిస్తే ఈ పథకంలో రాబడి ఎక్కువగా ఉందని ఆర్ధిక వేత్తలు చెబుతున్నారు. ఇప్పుడు మనం ఆ స్కీమ్‌ గురించి, ఆ స్కీమ్‌ వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. 

సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్
పోస్టాఫీస్‌లో ఈ స్కీమ్‌ను సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్‌సీఎస్‌ఎస్‌) అని పిలుస్తారు.  60 ఏళ్లు పైబడిన వ్యక్తులకు తక్కువ రిస్క్‌తో పోస్టల్‌ స్కీమ్‌ అందిస్తుంది. అధిక వడ్డీ రేటు, ఆదాయపు పన్ను ప్రయోజనాలను పొందవచ్చు. ఈ పథకాన్ని పోస్ట్ ఆఫీస్‌లో లేదా కొన్ని బ్యాంకుల్లో కూడా తెరవవచ్చు. ముఖ్యంగా పథకంలో డబ్బులు పొదుపు చేయాలంటే ఈ ఖాతా తెరిచే సయమానికి సంబంధిత ఖాతాదారుని వయస్సు 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు కలిగి ఉండాలి. అయితే కొన్ని వర్గాలకు చెందిన వ్యక్తులకు వయో సడలింపు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఖాతాలో సీనియర్ సిటిజన్లు రూ.15 లక్షల వరకు డిపాజిట్లపై త్రైమాసిక వడ్డీని పొందవచ్చు.

ఎవరు అర్హులు 
పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంక్‌లో సీనియర్ సిటిజన్ లైన అతని/ఆమె విడివిడిగా లేదంటే సంయుక్తంగా ఎస్‌సీఎస్‌ఎస్‌ ఖాతాను ఓపెన్‌ చేయొచ్చు.  

వడ్డీ రేటు
ప్రస్తుతం ఎస్‌సీఎస్‌ఎస్‌ వడ్డీరేటు 7.4శాతం ఉండగా కేంద్రం త్రైమాసిక ప్రాతిపదికన ఇతర పథకాలతోపాటు ఈస్కీమ్‌ వడ్డీ రేటును సవరిస్తుందనే విషయాల్ని గుర్తించుకోవాలి. ఇటీవల కేంద్రం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఈ స్కీమ్‌ వడ్డీ రేటు 2022 (నూతన సంవత్సరం 2022 మొదటి త్రైమాసికంలో) మారలేదు.

ఆదాయపు పన్ను మినహాయింపు
ఎస్‌సీఎస్‌ఎస్‌ ఖాతాలో చేసిన పెట్టుబడి ఆదాయపు పన్ను సెక్షన్ 80C కింద మినహాయింపు పొందచవ్చు. అధికారిక పోస్ట్ ఆఫీస్ వెబ్‌సైట్ నుండి వచ్చిన అప్‌డేట్‌ల ప్రకారం, ఒక ఆర్థిక సంవత్సరంలో అన్ని ఎస్‌సీఎస్‌ఎస్‌ ఖాతాలలో మొత్తం వడ్డీ రూ. 50,000 కంటే ఎక్కువ ఉంటే వడ్డీపై పన్ను విధించబడుతుంది.

మెచ్యూరిటీ పీరియడ్
ఎస్‌సీఎస్‌ఎస్‌ ఖాతాలో జమ చేసిన మొత్తానికి ఐదు సంవత్సరాల కాలవ్యవధికి వడ్డీ లభిస్తుందని డిపాజిటర్లు తప్పనిసరిగా గమనించాలి. డిపాజిటర్ ఖాతా మెచ్యూరిటీ అయిన ఒక సంవత్సరంలోపు, మూడు సంవత్సరాలకు ఒకసారి పొడిగింపు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

డిపాజిట్ పరిమితి
సీనియర్ సిటిజన్లు గరిష్టంగా రూ.15 లక్షల వరకు ఎస్‌సీఎస్‌ఎస్‌ ఖాతాలో పెట్టుబడి పెట్టవచ్చు. ఎస్‌సీఎస్‌ఎస్‌ ఖాతాను తెరవడానికి అవసరమైన కనీస మొత్తం రూ.1000గా ఉంది. 

చదవండి: ఎల్ఐసీకి భారీ షాక్‌, తగ్గుతున్న ఆదాయం

మరిన్ని వార్తలు